ఉత్తరప్రదేశ్ ఎన్నికల పోలింగ్ తుది అంకానికి చేరుకుంది. ఈనెల 7న చివరి దశ పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నిక జరిగే నియోజకవర్గాల్లో ప్రచార హోరు పెరిగింది. ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం సొంత నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. వేలాది మంది ఇరువైపులా బారులు తీరగా వారికి అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు.
అంతకుముందు వారణాసిలోని మాల్దహియా చౌక్లోని సర్దార్ పటేల్ గ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇక మోదీ రోడ్ షో వీడియోను షేర్ చేసింది యూపీ బీజేపీ. అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేస్తూ రోడ్లన్నీ మోదీమయం అయ్యాయని… కాశీ అంతటా మోదీ పేరు మార్మోగిందని అభివర్ణించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు 7వతేదీనాటి తుదివిడత పోలింగ్ తో ముగియనున్నాయి. ఈనెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా శుక్రవారం వారణాశిలోనే ఉన్నారు. కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తానూ, అన్నయ్య తరచూ కాశీ వస్తామని విశ్వనాథుడి ఆశీస్సులు తీసుకుంటామని ప్రియాంక అన్నారు. పార్టీ ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యేముందు వారు విశ్వనాథాలయాన్ని దర్శించారు.