జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పూర్తిస్థాయిలో దోహదపడింది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. సంఘ్ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నట్లు ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పారు. రేడియో పాడ్ కాస్ట్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ ఇప్పుడు ఆసక్తికరంగా నిలుస్తోంది.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆర్ఎస్ఎస్ తో తను అనుబంధాన్ని మోదీ స్పష్టంగా వివరించారు. “సంఘ్ (ఆర్ఎస్ఎస్) చాలా పెద్ద వ్యవస్థ. ఈ సంవత్సరంతో వందేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ప్రపంచంలో ఆర్ఎస్ఎస్ కన్నా పెద్ద సేవా సంఘం మరొకటి లేదు. సంఘ్ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. సంఘ్ కార్యకలాపాలను అర్థం చేసుకోవాలంటే కొంత ప్రయాస పడాల్సిందే. జీవితం తాలుకా లక్ష్యాన్ని, ఉద్దేశ్యాన్ని సంఘ్ నేర్పిస్తుంది. దేశమే సర్వస్వం, జనాలకు సేవ చేయడమంటే, దేవుడికి సేవ చేయడమే అని నేర్పిస్తుంది” అని ప్రధాని తెలిపారు.
స్ఫూర్తి ఇచ్చిన అంశాల గురించి నరేంద్ర మోదీ వివరణ ఇచ్చారు.
“వేదాలు, స్వామి వివేకానందా చెప్పిన మాటలనే సంఘ్ సభ్యులు నేర్పిస్తుంటారు. సంఘ్లోని కొంత మంది సభ్యులు విద్యలో మార్పుల కోసం విద్యా భారతి అనే సంస్థను నెలకొల్పారు. దేశవ్యాప్తంగా వారు 25 వేల పాఠశాలలను నడుపుతున్నారు. 30 లక్షల మంది విద్యార్థులు వాటిల్లో చదువుతున్నారు. వామపక్షాలకు చెందిన కార్మిక సంఘాలు ప్రపంచంలోని కార్మికులందరూ ఏకం కండి అని నినాదమిస్తే కార్మికులారా ప్రపంచాన్ని ఏకం చేద్దాం అని ఆర్ఎస్ఎస్కు చెందిన కార్మిక సంఘాలు పిలుపునిస్తాయి” అని వివరించారు.
విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మవంటిదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాను విమర్శలను స్వాగతిస్తానని, అవి మరింత పదునుగా ఉండాలని చెప్పారు. “నా శక్తి పేరులో లేదు. 140 కోట్ల మంది భారతీయుల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలోనే ఉంది. నేను ప్రపంచ నేతలతో చేయి కలిపినప్పుడు, అది మోదీ చేస్తున్నది కాదు. 140 కోట్ల మంది భారతీయులు చేస్తున్నట్లే” అని తెలిపారు.
“శాంతి గురించి మేం మాట్లాడినప్పుడు, ప్రపంచం మా మాట వింటుంది. ఎందుకంటే గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ జన్మించిన నేల ఇది” అని మోదీ పేర్కొన్నారు.
పాకిస్తాన్ భారత్ సంబంధాల గురించి నరేంద్ర మోడీ స్పష్టత ఇచ్చారు . పాకిస్తాన్తో శాంతి చర్చల కోసం భారత్ గౌరవపూర్వకంగా ప్రయత్నాలు చేసిన ప్రతిసారీ ద్రోహం, విద్వేషమే ప్రతిఫలంగా లభించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరుదేశాలు కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలనే గొప్ప సంకల్పంతో 2014లో ప్రధానిగా ప్రమాణం చేసే వేళ నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆహ్వానించానని ఆయన గుర్తు చేసుకున్నారు. కనీసం ఇప్పటికైనా శాంతి మార్గాన్ని పాక్ ఎంచుకుంటుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
“బహుశా పాకిస్తాన్ ప్రజలు కూడా శాంతి కోసం ఎదురు చూస్తుండొచ్చు. వాళ్లు కూడా అశాంతితో, ఉగ్రవాద చర్యలతో అలసిపోయి ఉంటారు. ఉగ్రవాదం వల్ల పాక్లో అమాయక పిల్లలు చనిపోతున్నారు. ఎంతోమంది ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి” అని మోదీ పేర్కొన్నారు.
అనేక అంశాల మీద నరేంద్ర మోడీ వివరణాత్మకంగా మాట్లాడారు. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.