కీలకమైన వైద్య, విద్యారంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ విద్యావిధానాన్ని ఇప్పటికే అమల్లోకి తెచ్చిన కేంద్రం…ఇక వైద్యరంగంలో సంస్కరణలపై దృష్టిపెడుతోంది. ప్రతిజిల్లాకు ఓ వైద్య కళాశాల పథకం వల్ల రానున్న పదేళ్లలో రికార్డు స్థాయిలో వైద్యుల సంఖ్య పెరగనుందని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ భుజ్ జిల్లాలో కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని. వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి జరుగుతోందన్నారు. భుజ్ జిల్లాలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటు ధరలకు అందజేస్తుందన్నారు.
రెండు దశాబ్దాల క్రితం గుజరాత్లో కేవలం తొమ్మిది వైద్య కళాశాలలు, 1,100 సీట్లు మాత్రమే ఉండేవని ..ఇప్పుడాసంఖ్య. 36 వైద్య కళాశాలలు, 6,000 సీట్లకు చేరిందని గుర్తు చేశారు. 2001లో సంభవించిన భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేస్తూ…భుజ్, కచ్ ప్రాంతాల ప్రజలు ఆయా ప్రాంతాలకు సరికొత్త రాతను లిఖించుకున్నారని ప్రశంసించారు.
మెరుగైన ఆరోగ్య సదుపాయాలంటే కేవలం వ్యాధులకు చికిత్స మాత్రమే కాదని, సామాజిక న్యాయం కూడా జరగాలని మోదీ ఆకాంక్షించారు. చవగ్గా , నాణ్యమైన వైద్యం అందినప్పుడే నిరుపేదకు వ్యవస్థపై నమ్మకం బలపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
శ్రీ కచ్చి లేవ పటేల్ సమాజ్ ఆధ్వర్యంలో కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. కచ్లో మొదటి చారిటబుల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇదే. దీనిలో 200 పడకల ఆస్పత్రిలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ (క్యాత్ల్యాబ్), కార్డియోథొరాసిక్ సర్జరీ, రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, న్యూరో సర్జరీ, కీళ్ళ మార్పిడి, ఇతర సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)