తెలంగాణాలో తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విమర్శలనేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ.
“ఈ తెలంగాణ నేలనుంచి యోగి ఆదిత్యనాథ్ జీని నేను అభినందిస్తున్నా. ఎవరో రాష్ట్రంలో ఒక ప్రాంతానికి వెళ్లకూడదని, వెళ్తే మీ పదవికి ప్రమాదం అని చెపితే.. యోగి జీ తనకు సైన్స్ మీద నమ్మకం ఉందని చెప్పి వెళ్లిపోయారు. ఈరోజు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించే వ్యక్తుల నుంచి తెలంగాణను మనం రక్షించుకోవాలి” అని ప్రధాని అన్నారు.
గతంలో తన మూఢనమ్మకాలతో ఆరోపణలు ఎదుర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. ఇదివరకే మాజీ ఎంపీ కె.విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మూఢనమ్మకాలతో ప్రజల మతపరమైన మనోభావాలను పట్టించుకోలేదన్నారు. ‘వాస్తు’ కారణంగా 2016 లో కేసీఆర్ కొత్త ఇంటికి మారడంపై అప్పట్లో చర్చజరిగింది.
ఇదిలా ఉండగా…నోయిడాలో ఏ ముఖ్యమంత్రి పర్యటించినా. పదవిలోంచి వెళ్ళిపోతారనే అపోహను యోగి ఆదిత్యనాథ్ బద్దలు కొట్టారని, అధికారం పోతుందనే భయంతో నాయకులు నగరానికి వెళ్లకుండా తప్పించుకున్నారని చాలాసార్లు చెప్పినప్పటికీ.. యోగి వెనుకడుగు వేయకుండా వెళ్లిపోయారని మోదీ గుర్తు చేశారు.
హైదరాబాద్లో తన ప్రసంగంలో, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతూ.. వంశపారంపర్య రాజకీయాలు లేదా ‘పరివార్వాద్(కెసిఆర్ ప్రభుత్వం)పై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. దక్షిణాది రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్గా మార్చడమే బీజేపీ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని చెప్పారు.