తెలంగాణ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. తాము అభివృద్ధి కోసం పాటుపడుతుంటే కొందరు తమ స్వార్థం చూసుకుంటున్నారని పేరు ప్రస్తావించకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై మండిపడ్డారు మోదీ. పరేడ్ గ్రౌండ్ లో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై, కేసీఆర్ కుటుంబంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే కేంద్రపథకాలు అమలు సరిగా జరగడం లేదని, ఆలస్యం అవుతున్నాయని మండిపడ్డారు. కేంద్రంతో కలిసి పనిచేసేందుకు రాష్ట్రం ముందుకురావడం లేదని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబపాలనపై ఆందోళన వ్యక్తంచేసిన భారత ప్రధాని…ఎక్కడైతే కుటుంబపాలన ఉంటుందో అక్కడ అవినీతి ఉంటుందన్నారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా అనిమోదీ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఆందోళన చెందుతున్నారన్న మోదీ.. డిజిటల్ లావాదేవీల ద్వారా వ్యవహారాలు నడపాల్సి వస్తోందన్నారు. నిజాయతీగా పనిచేసేవాళ్లంటే వాళ్లకు భయమని ఆయన అన్నారు. కుటుంబ పాలన చేస్తున్న వాళ్లతో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… వాళ్లు ఎక్కడా ఎవరూ తమను ప్రశ్నించకూడదనే నియంతృత్వ వైఖరితో ఉంటారనీ మండిపడ్డారు. కేంద్రానికి రాష్ట్రం సహకరించకపోవడం వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బందిపడుతున్నారని గుర్తు చేశారు. ప్రతి ప్రాజెక్టులోనూ స్వార్థం చూసుకుంటున్నారని వాళ్ల స్వలాభం తప్ప ప్రజల బాగోగులు పట్టడం లేదని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కుటుంబవాద పార్టీలు వ్యవస్థపై ఆధిపత్యం చేస్తున్నాయన్న భారత ప్రధాని ఆవినీతిపరులు ఎక్కడున్నా ఏరిపారేస్తామన్నారు. తనపై పోరాటానికి అవినీతి పార్టీలు, కుటుంబపార్టీలు ఏకమయ్యాయని..అయితే కోర్టు వారికే చీవాట్లు పెట్టిందని మోదీ గుర్తుచేశారు. బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం మోదీ నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి ఢిల్లీ బయల్దేరారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఉదయం 11.30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగిన ప్రధానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తదితరులు స్వాగతం పలికారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆయన ప్రారంభించారు.
పేరెత్తెకుండానే చురకలు – కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిని ఎత్తిచూపిన మోదీ
Share: