ప్రధాని నరేంద్ర మోదీ విమానంలో స్విమ్మింగ్ పూల్ ఉందంటూ అధిర్ రంజన్ చౌదరి వింతవ్యాఖ్య చేశారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళ్ళేటపుడు విమానంలో స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తారని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.రాహుల్ గాంధీ నేపాల్ పర్యటన సందర్భంగా వైరల్ అయిన వీడియో గురించి మీడియా అడగ్గా చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ ఒక మహిళతో కలిసి పబ్లో ఉన్న వీడియో అదో. ఆ మహిళ నేపాల్లో చైనా రాయబారి అని ప్రచారం జరిగింది. అసలైతే ఓ జర్నలిస్ట్ పెళ్లికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ నేపాల్ వెళ్లారు. నేపాల్లో రాహుల్ గాంధీ పబ్ లో కనిపించిన వెంటనే బీజేపీ ఆరోపణలు మొదలుపెట్టింది. దీంతో కాంగ్రెస్ నాయకులు, గాంధీ కుటుంబ విధేయులు కౌంటర్ చేయడం మొదలుపెట్టారు. విచిత్రమైన వాదనల ద్వారా రాహుల్ ను సమర్థిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాని, రాష్ట్రపతి అధికారిక ప్రయాణాలకు వినియోగించే వీవీఐపీ ఎయిర్క్రాఫ్ట్ ల గురించి మాట్లాడారు. విదేశీ పర్యటనల్లో ప్రధాని స్విమ్మింగ్ చేస్తారని అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు.
“బీజేపీ రాహుల్ గాంధీకి భయపడుతోంది, అందుకే అది ఆయనను లక్ష్యంగా చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 13,000 కోట్ల విలువైన రెండు విమానాలను కొనుగోలు చేశారు. వాటిలో స్విమ్మింగ్ పూల్ లు ఉన్నాయి, ఆయన అందులో స్నానం చేస్తూ విదేశాలకు వెళ్లి అక్కడ ప్రసంగం చేసి తిరిగి వస్తాడు. రాహుల్ గాంధీ తన స్నేహితురాలి వివాహానికి హాజరయ్యేందుకు నేపాల్ వెళ్ళాడు, దాని కోసం తన సొంత జేబులో నుంచి డబ్బు ఖర్చు చేసాడు. నేపాల్ వెళ్లలేని దేశం ఏం కాదు, అది మన పొరుగు దేశం. దానిపై రాహుల్ గాంధీపై బీజేపీ దాడి చేసిన తీరు చూస్తే బీజేపీ రాహుల్ గాంధీకి భయపడుతున్నట్లు తెలుస్తోంది” అని అన్నారు.
రాహుల్ గాంధీ అడిగిన ఏ ప్రశ్నకు బీజేపీ దగ్గర సమాధానం లేదని.. రాహుల్ గాంధీ ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఎప్పుడూ చెప్పలేదనీ అన్నారాయన.
అయితే చౌదరి వ్యాఖ్యలు హాస్యాస్పదం అంటోంది బీజేపీ..ఎందుకంటే విమానంలో స్విమ్మింగ్ పూల్ ఉండటం దాదాపు అసాధ్యం. ప్రయాణీకుల విమానంలో ఒక కొలను ఉండదు. VVIP ప్రత్యేక విమానంలోనూ ఆ అవకాశం ఉండదు.
మొదటగా స్విమ్మింగ్ పూల్ లో పట్టేంత నీరు బరువుగా ఉంటాయి. విమానాలలో బరువు చాలా ముఖ్యమైన అంశం, ఎంత వీలైతే అంత తక్కువ బరువు ఉండేలా చూస్తారు. అనవసరమైన వస్తువులకు, బరువుకు తావివ్వరు.
రెండవది, ఒక విమానం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండదు. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానాలు కదుల్తాయి. దీని అర్థం ఫ్లైట్ లో నీరు స్థిరంగా ఉండదని, నీరు విమానం లోపల ప్రతిచోటా పడి విమానం కలిగి ఉన్న క్లిష్టమైన కమ్యూనికేషన్, రక్షణ పరికరాలతో పాటు లోపల ఉన్న ప్రతిదీ నీటిలో తడిసిపోతుంది. ఇది విమాన గురుత్వాకర్షణ కేంద్రాన్ని మారుస్తుంది, దాంతో విమానం అస్థిరంగా మారవచ్చు.
వివరంగా చెప్పాలంటే భద్రతా కోణం, ఇతర కారణాల దృష్టా విమానంలో స్విమ్మింగ్ పూల్ ఉండటం సాధ్యం కాదు. ఇంధనం వంటి ద్రవాలు రవాణా విమానాల ద్వారా రవాణా చేయబడినప్పటికీ, అవి బహిరంగంగా రవాణా చేయబడవు. వీటిని ఎప్పుడూ ట్యాంకర్ల లోపలే రవాణా చేస్తారు. అంటే ద్రవం ట్యాంకులు లేదా బ్లాబర్లలో ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ లాగా బయట నిల్వచేయరు.