మూడు రోజుల పర్యటన లో భాగంగా జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ ఈ సాయంత్రం బెర్లిన్లో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దీనికి ముందు, ఫెడరల్ ఛాన్సలరీ వద్ద మోదీకి అక్కడి లాంఛనాలతో స్వాగతం లభించింది. మోదీ జర్మనీ రాజధాని బెర్లిన్కు తెల్లవారుజామున చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయుల నుంచి ఆయనకు ఘనస్వాగతం లభించింది.
ప్రవాస భారతీయులను కలవడం చాలా అద్భుతంగా ఉందని, ప్రవాసులు సాధించిన విజయాలకు భారతదేశం గర్వపడుతుందని ప్రధాన మంత్రి ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఈ పర్యటన భారత్-జర్మనీల మధ్య స్నేహబంధాన్ని పెంపొందిస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్-జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్-IGC ఆరవ ఎడిషన్కు మోదీ, జర్మన్ ఛాన్సలర్ సహ అధ్యక్షులుగా ఉంటారు. ఇది ఛాన్సలర్ స్కోల్జ్తో మోదీ మొదటి IGC, అలాగే గత సంవత్సరం డిసెంబర్లో అధికారం చేపట్టిన కొత్త జర్మన్ ప్రభుత్వంచే మొదటి సంప్రదింపులు ఇవి.
జర్మనీ పర్యటన ముగించుకుని, డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సెన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటనలో భాగంగా రేపు కోపెన్హాగన్కు వెళ్లనున్నారు. ఇది డెన్మార్క్కు ఆయన మొదటి పర్యటన, అలాగే డెన్మార్క్ ప్రధానమంత్రితో మూడవ శిఖరాగ్ర స్థాయి పరస్పర చర్చ. ఈ చర్చల్లో ద్వైపాక్షిక అంశాల తోపాటు ప్రపంచ, ప్రాంతీయ ప్రయోజనాలపై దృష్టి సారిస్తారు. మోదీ ఇండియా-డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్కు కూడా హాజరవుతారు, ఆ తర్వాత భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
బుధవారం డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్, స్వీడన్ సహా నార్వే ప్రధాన మంత్రులతో కలిసి 2వ ఇండియా-నార్డిక్ సమ్మిట్లో మోదీ పాల్గొంటారు.
పర్యటన చివరి దశలో ప్రధాని కొద్దిసేపు పారిస్లో ఆగి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ను కలుస్తారు. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల తర్వాత రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ఫ్రాన్స్ పర్యటన అవకాశం కల్పిస్తుంది.