మోడీ ఉంటే తీన్మార్ సంభవమే
భారత దేశాన్ని ఫార్మాట్ చేసే పని వేగంగా జరుగుతోంది. 1947 నుంచీ సరైన దిశలో భారత దేశం ప్రగతి పథంలో పయనించడం మొదలైంది 2014లోనే. అంతకు ముందు అడపాదడపా కొంత ప్రయత్నం జరిగినా, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అంటూ 5 లక్షల కోట్ల ఎకానమీ లక్ష్య సాధనకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. కాబట్టే, ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎగబాకింది. అయతే ఈ మధ్య మళ్లీ స్వల్ప తేడాతో ఆరో స్థానానికి జారినా, మళ్లీ 2025 నాటికి బ్రిటన్ ను భారత్ వెనక్కి నెడుతుంది. మళ్లీ ఐదో స్థానానికి ఎగబాకుతుందని ఎవరో బిజెపి నాయకులు చెప్పలేదు. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సి.ఇ.బి.ఆర్) అంచనా వేశారు. అంతే కాదు, 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందనేది ఆ సంస్థ తాజాగా తెలిపిన అంచనా సారాంశం. చైనా మొదటి స్థానానికి, అమెరికా రెండో స్థానానికి చేరుతాయట. జపాన్ మన తర్వాత నాలుగో స్థానంలో ఉంటుందట.
నిజానికి, మన దేశానికి ఉన్న సహజ వనరులు, మానవ వనరులను సరిగ్గా ఉపయోగించి ఉంటే, ప్రభుత్వాలు సరైన దిశలో పనిచేసి ఉంటే ఇప్పటికే మన దేశం ప్రపంచంలో నంబర్ వన్ అయి ఉండేది. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ప్రగతి మందగించింది. మోడీ హయాంలో స్వచ్ఛ భారత్ అంటే కొందరు నవ్వారు. అయితే ఇప్పటికీ టాయిలెట్ లేకుండా ఆరుబయటకు వెళ్లే పరిస్థితి ఉంటే ఇక ఈ దేశం ఏం బాగుపడుతుంది అన్న మోడీ మాట, అందరినీ ఆలోచింప చేసింది. జన్ ధన్ బ్యాంకు ఖాతాలు, మేకిన్ ఇండియా, ఇతర పథకాల ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడానికి మోడీ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు.
కరోనా కష్టాన్ని తట్టుకుని భారత్ మళ్లీ ప్రగతి పథంలో పట్టాలు ఎక్కింది. వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు 9 శాతానికి పెరగవచ్చనేది తాజా అంచనా. ఆ తర్వాతి ఏడాది 7 శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చట. విదేశీయుల దండయాత్రకు ముందు భారత్ అత్యంత సంపన్న దేశం. ప్రపంచానికి నాగరికతను నేర్పిన దేశం మనది. ఎంతో మంచి విషయాలను ప్రపంచానికి అందించిన దేశమిది. దాదాపు వెయ్యి ఏళ్ల బానిసత్వం తర్వాత స్వాతంత్ర్యం పొందిన భారత్, ఇంత కాలానికి సరైన మార్గంలో ముందుకు దూసుకుపోతోంది. కాబట్టి మోడీ హయాంలో అందిన ఊతంతో భారత్ మూడో అతిపెద్ద ఎకానమీగా మారడంలో అనుమానం ఉండదు. ఇలాంటి నాయకత్వం కలకాలం మనకు దొరికితే నంబర్ టూ లేదా నంబర్ వన్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు నమో భక్తులు.