మూడోసారి అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రభుత్వం దూకుడు పెంచింది. సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా అనేక చర్యలు చేపడుతోంది. రైల్వే శాఖలో వందే భారత్ దూరంతో వంటి ఆధునిక రైలు సదుపాయాలు తీసుకుని వచ్చింది. దీంతో వేగవంతమైన నాణ్యమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ధనవంతులకు పెద్దపీట వేస్తున్నారు అన్న విమర్శ కూడా ఎదురవుతోంది.
ఈ క్రమంలో సామాన్య ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ఎక్సుప్రెస్ రైళ్లలోనూ జనరల్ కంపార్ట్మెంట్లను పెంచాలని నిర్ణయం తీసుకొంది. జనరల్ బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. రిజర్వేషన్ ఉన్నా కూర్చోడానికి కూడా వీలు లేకుండా బోగీ మొత్తం అన్రిజర్వ్డ్ ప్రయాణికులతో నిండిపోయి ఉందని రిజర్వేషన్ చేసుకున్న పలువురు ప్రయాణికులు తరచుగా ఆరోపిస్తున్నారు.
దీనిపై రైల్వే శాఖకు పలు ఫిర్యాదు అందడంతో స్పందించిన రైల్వే బోర్డు అధికారులు సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రైల్వే శాఖకు అవసరమైన కోచ్ల నిర్మాణంతో పాటు అదనంగా ఏడాదికి 2500 సామాన్య తరగతి కోచ్లను తయారు చేయించాలని నిర్ణయించింది. దీని కారణంగా దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 18 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని రైల్వే సీపీఆర్వో వినీత్ అభిషేక్ వెల్లడించారు.
తాజా నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న రెండు జనరల్ కోచ్లను రెట్టింపు చేసి నాలుగుకు పెంచుతారు. అసలు జనరల్ కోచ్లే లేని రైళ్లకు రెండు జనరల్ కోచ్లను జత చేస్తారు.
ప్రతి కోచ్లో 150 నుంచి 200 మంది ప్రయాణించేలా వీటిని డిజైన్ చేస్తారు. దీని ప్రకారం ప్రతిరోజూ 5 లక్షల మంది వీటిలో ప్రయాణించవచ్చు. అలాగే ఈ నిర్ణయంతో మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రయాణికులను తీసుకువెళ్లే సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఏటా తయారవుతున్న 1377 స్లీపర్ క్లాస్ కోచ్లతో పాటు 2500 జనరల్ కోచ్లు ఈ ఆర్థిక సంవత్సరంలోగానే సిద్ధమవుతాయని వినీత్ అభిషేక్ తెలిపారు.
ఈ నిర్ణయంతో సామాన్య ప్రయాణికులకు ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా అప్పటికప్పుడు ప్రయాణం చేసే పల్లెటూరు ప్రయాణికులకు ఇది చాలా ఉపయోగకరం.