ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు అల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ తొలి సమావేశ ప్రారంభ సెషన్లో ప్రసంగించారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని సహా DLSA లు చర్చించారు. ఈ సమావేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు.
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NLSA) ద్వారా జూలై 30-31 తేదీల మధ్య విజ్ఞాన్ భవన్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్(DLSAs) మొట్టమొదటి జాతీయ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. DLSAల అంతటా సజాతీయత, సమకాలీకరణను తీసుకురావడానికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించడంపై సమావేశంలో చర్చించనున్నారు. దేశంలో మొత్తం 676 డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA)లు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ భారతదేశ న్యాయపరమైన మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడానికి చేసిన పని గురించి మాట్లాడారు.గత 8 సంవత్సరాలలో దేశంలో న్యాయపరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి శరవేగంగా పని జరిగింది అని ఆయనన్నారు. ఇ-కోర్టుల మిషన్ కింద దేశంలో వర్చువల్ కోర్టులు ప్రారంభంకానున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి నేరాల కోసం 24-గంటల కోర్టులు పనిచేయడం ప్రారంభించాయి. కోర్టులలో వీడియో కాన్ఫరెన్సింగ్ మౌలిక సదుపాయాలను కూడా విస్తరింపజేస్తున్నారని ప్రధాని అన్నారు.
సీజేఐ ఎన్వీ రమణ జిల్లా జ్యుడీషియల్ అధికారుల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. మెజారిటీ జనాభాకు జిల్లా జ్యుడీషియల్ అధికారులే మొదటి సంప్రదింపులు. జిల్లా న్యాయవ్యవస్థతో అనుభవం ఆధారంగా న్యాయవ్యవస్థపై ప్రజాభిప్రాయం ఉంటుంది.. అందుకని జిల్లా న్యాయవ్యవస్థను పటిష్టం చేయడం నేటి అవసరం అని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు.
DLSAలు, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ (SLSA) ల ద్వారా, వివిధ న్యాయపరమైన అవగాహన కార్యక్రమాలు NALSA ద్వారా అమలుచేస్తారు. NALSA నిర్వహించే లోక్ అదాలత్ లను నియంత్రించడం ద్వారా కోర్టులపై భారాన్ని తగ్గించడంలో DLSAలు దోహదపడతాయి.