హోలీ సంబరాలకు గుజరాత్ రాష్ట్రంల ఈ సారి కూడా దూరంగా ఉండబోతోంది. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షికంగా లాక్డౌన్ విధిస్తుండగా.. మరికొన్నిచోట్ల రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధిస్తున్నాయి. తాజాగా.. గుజరాత్ ప్రభుత్వం కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా హోలీ వేడుకలకు బ్రేకులు వేసింది. ఈ సారి హోలీ వేడుకలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. అయితే నిబంధనలను పాటిస్తూ.. హోలికా దహనం మాత్రం నిర్వహించుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. నిబంధనలను పాటించకుండా.. ఇష్టారీతిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం నితీన్ పటేల్ హెచ్చరించారు. ఈ నెల 29వ తేదీన హోలీ పండుగ ఉండగా.. అంతకుముందు రోజు హోలికా దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.