మూడు రోజుల పర్యటన నిమిత్తం మోదీ అమెరికా చేరుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరుణ్ జిత్ సింగ్ సందు,
వాషింగ్టన్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సందు, అమెరికా అధికారులు.. ఆర్మీ బ్రిగేడియర్ అనూప్ సింగాల్, ఎయిర్ కమాండర్ అంజన్ భద్ర, నౌకాదళ కమాండర్ నిర్భయా బప్నా విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో భారతీయులు విమానాశ్రయం దగ్గర త్రివర్ణపతాకాన్ని పట్టుకుని ప్రధానికి స్వాగతం పలికారు. వందమందికిపైగా ప్రవాసులు ఆయనకు స్వాగతం చెప్పేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. వారందరికీ మోదీ ధన్యవాదాలు చెప్పారు.
‘వాషింగ్టన్లో నాకు స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు కృతజ్ఞతలు. మన ప్రవాసులే మనకు బలం. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ ప్రత్యేకతను చాటుకోవడం అభినందనీయం’ అని ప్రధాని మోదీ అన్నారు. మూడురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమోరికాలో తీరికలేకుండా గడపనున్నారు.
తొలిసారి నేరుగా నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సులో మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్య సమితి 76 వార్షిక సదస్సులో ప్రసంగిస్తారు. ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీల సీఈవోలతోనూ ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది.
వాషింగ్టన్ డిసిలో ప్రధాని మోదీ క్వాల్కామ్, అడోబ్, బ్లాక్స్టోన్, జనరల్ ఆటామిక్స్, ఫస్ట్ సోలార్ సంస్థల బాస్లతో ఆయన ఇష్టాగోష్టి నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.
అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ తో మోదీ సమావేశం కానున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం పెట్టుబడులు, ఉగ్రవాదం నిర్మూలన సహా కీలకమైన అఫ్గనిస్తాన్ అంశాలపై చర్చించనున్నారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు భారతసంతతి మహిళ కూడా అయిన కమలా హ్యారిస్ తోనూ మోదీ సమావేశం అవుతారు.