తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు వివాదం మొదలైనప్పటి నుంచి వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తప్పుల మీద తప్పులు చేస్తూ దొరికిపోతున్నారు. భక్తులంతా పవిత్రంగా భావించే లడ్డూలో జంతువుల కొవ్వులు కలిసాయి.. అంటే నాన్ వెజిటేరియన్ కలిపారు అన్న విమర్శను తెలుగుదేశం తీసుకొని వచ్చింది. ఇది ఎంత తీవ్రమైన ఆరోపణ అన్నది అప్పుడే గ్రహించి వైసిపి వేగంగా స్పందించ వలసింది. కానీ దీనిని చాలా లైట్ గా తీసుకుంటూ వైయస్ జగన్ ఒక మొక్కుబడి ప్రకటన చేసి ఇంట్లోకి వెళ్లిపోయారు.
కానీ ఈలోగా ఈ విషయం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని శ్రీవారు భక్తులకు పూర్తిగా చేరిపోయింది. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వులు కలిపారు అంటూ దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే జగన్ కనపడితే మీద పడి కొట్టేద్దాం అన్నంత కోపం భక్తుల్లో నెలకొని ఉంది.
దీన్ని కరెక్ట్ గా డీల్ చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. తిరుమల పాపం అంతా నేరుగా జగన్ అకౌంట్లో వేసేయడమే కాకుండా, హిందువుల్లోకి వేగంగా వెళ్లేందుకు జనసేన తరఫున కార్యాచరణ చేపట్టారు. దీనికి శాస్త్రీయత జోడిస్తూ హైందవ దేవాలయాలను శుద్ధి చేయాలని జనసేన క్యాడర్ కు పిలుపునిచ్చి ఆయన కూడా నేరుగా రంగంలోకి దిగిపోయారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైందవులకు ముఖ్యంగా శ్రీవారి భక్తులకు.. పవన్ కళ్యాణ్ నాయక్ గా మిగిలితే జగన్మోహన్ రెడ్డి ఖల్ నాయక్ అయిపోయారు.
వాస్తవానికి ఈ అవకాశాన్ని బిజెపి అందిపుచ్చుకోవాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కన్నా ముందు అడుగులు వేసుంటే బీజేపీకి బాగా మైలేజ్ వచ్చిండేది. కానీ బిజెపి మీన మేషాలు లెక్కిస్తుంటే … ఈ లోగా జనసేన రంగంలోకి దిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తైతే పూర్తిగా కూరుకొనిపోయాం అని తెలిసిన తర్వాత వైసిపి మేలుకొని మరో తప్పు అడుగు తప్పటడుగు వేసింది.
వైసీపీ తరఫున శుద్ధి కార్యక్రమం చేపడతామంటూ గంభీరంగా ప్రకటనలు ఇచ్చి తిరుమలలో వెళ్లి పూజ చేస్తానంటూ వైయస్ జగన్ ప్రయాణం పెట్టుకున్నారు. అసలు ఈ పని మొట్ట మొదటి రోజున చేసి ఉండాల్సింది. శ్రీవారి లడ్డు గొడవ బయటకు రాగానే, నేరుగా తిరుపతి వెళ్లి అలిపిరి దగ్గర నిరాహార దీక్ష కు దిగితే టీడీపీ ఇరుక్కొని ఉండేది. ఏప్రిల్ లో అమ్ముడైన లడ్డూలను ఇప్పుడు తెచ్చి, నిర్థారణ చేయటం ఎవరికీ సాధ్యం కాదు.
కానీ, అప్పుడు ఇంట్లో పడుకొని, ఇప్పుడు తిరుమల వెళతా అంటే దొరికిపోయినట్లే. గతంలో అధికారంలో ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండా వైయస్ జగన్ తప్పించుకున్నారు.
ఎప్పటినుంచో కాసుకొని ఉన్న తెలుగుదేశం వర్గాలు వెంటనే భగ్గుమని మండిపడ్డాయి. చేయాల్సిన పాపం అంత చేసి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తానంటే ఎలా అంటూ కొత్త టెక్నిక్ పాయింట్ బయటకు తీశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని అన్యమతస్తులు అక్కడ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. వైయస్ జగన్ నూటికి నూరుపాళ్ళు క్రైస్తవుడు కాబట్టి ఖచ్చితంగా డెకరేషన్ ఇచ్చాకే ముందుకు వెళ్లాలి అన్న డిమాండ్ ని బయట పెట్టారు. గురి పెట్టి కొట్టిన షాట్ కి వైయస్ జగన్ పూర్తి ఇరుక్కుపోయాడు. ఇప్పుడు తాను హిందువుని అని డిక్లరేషన్ ఇచ్చి ముందుకు వెళితే ఒక సమస్య, కాదు అని మొండికేస్తే మరో సమస్య. దీంతో తిరుమల ప్రయాణం రద్దు చేసుకుని ప్రెస్ మీట్ పెట్టేందుకు జగన్ నిర్ణయించుకున్నారు.
కానీ ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ పూర్తిగా జరిగిపోయింది. అందుకే రాజకీయాల్లో ఆత్మహత్యలుంటాయి తప్ప హత్యలు పెద్దగా ఉండవు అని అంటారు. శ్రీవారి లడ్డు విషయంలో మాత్రం అడుగడుగునా వైసీపీ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంటూ ముందుకు వెళ్లి పోతోంది