అనాథ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ మరో అద్భుత పథకం మిషన్ వాత్సల్య. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఉద్దేశించిన స్కీం ఇది. గతంలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం ను రెండేళ్లనుంచి మిషన్ వాత్సల్య పథకం పేరుతో అమలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ పథకంలో కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతం. అయితే ప్రత్యేక హోదా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కేంద్రమే 90 శాతం వాటా ఉంటుంది.
రాష్ట్రాలు, జిల్లాల భాగస్వామ్యంతో పిల్లల కోసం 24X7 హెల్ప్ లైన్ సేవల్ని అందుబాటులో ఉంచుతున్నారు. అనాథ పిల్లల కోసం శరణాలయాలు, ప్రత్యేక వసతి గృహాలనూ నిర్వహిస్తున్నారు ఈపథకం కింద. ఇక అనాథ పిల్లల దత్తతనూ పలు ఏజెన్సీల ద్వారా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు అనాథ పిల్లలకు నెలకు 4 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ఈ పథకం కింద అందిస్తున్నారు.
మిషన్ వాత్సల్య పథకానికి అర్హులెవరు?
అనాథలుగా ఉంటూ బంధువులతో జీవిస్తున్నవారు, విడాకులు పొందిన లేదా వితంతువు అయిన తల్లి దగ్గర ఉంటున్న పిల్లలు, తల్లిదండ్రులు ప్రాణాంతక వ్యాధికి గురై ఉండి, వారు ఆర్థికంగా, శారీరంగా దుర్బలులైన పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఇక జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, బాలకార్మికులు, దివ్యాంగులైన పిల్లలు, ఇంటినుంచి పారిపోయి వీధులపాలైన వారు, బాల యాచకులు, దోపిడీకి గురైన వాళ్లూ ఈ స్కీంకు అర్హులు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి సీఎం కేర్స్ ఫర్ పథకం కింద నమోదైన వారు కూడా మిషన్ వాత్సల్య పథకానికి అర్హులే.
అయితే వితంతువు లేదా విడాకులు తీసుకున్న తల్లి దగ్గర ఉన్న పిల్లలైతే వారి తల్లి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 72000 లకు, పట్టణప్రాంతాల్లో అయితే 96 వేలకు మించరాదు. విడాకులు పొందితే గనుక వీఆర్వో నుంచి ధ్రువపత్రం తీసుకోవాలి.
మిషన్ వాత్సల్య దరఖాస్తుకు కావల్సిన డాక్యుమెంట్లు ఏవి?
బాలుడు లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం, మరణానికి కారణం తెలిపే పత్రం. తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు, గార్డియన్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, లేదా రైస్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, స్టడీ సర్టిఫికెట్, తల్లిదగ్గర పెరిగే పిల్లలైతే ఆమె ఆదాయ ధ్రువీకరణ పత్రం, వాళ్ల వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంట్ లేదా తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ తో కలిసిన జాయింట్ ఎకౌంట్. ఇద్దరు పిల్లలుంటే కనుక రెండు అకౌంట్లు తీసుకోవాలి.
ఎక్కడ అప్లై చేయాలి?
ఈనెల 30 లోపు పైన చెప్పిన పత్రాలతో ఏపీలో అయితే గ్రామ సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో అయితే సమీప శిశు సంక్షేమ కార్యాలయాలను, అంగన్వాడీ కేంద్రాలను సంప్రదించవచ్చు. అయితే కేవలం సచివాలయ సిబ్బంది, అంగన్వాడీలు, వాలంటీర్లే కాదు ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మీ సమీపంలో మీ మీ ప్రాంతాల్లో ఇలా ఎవరైనా అనాథ పిల్లలుంటే..వారు ఈ పథకానికి అర్హులైతే వారికి సాయం చేయండి.