ఇటీవలే యూకే పర్యటన ముగించుకుని వచ్చిన తెలంగాణ ఐటీ మంత్రికేటీఆర్ రాష్ట్రంలో తమ ప్రభుత్వం సాధించిన జలవిజయాన్ని ప్రపంచ వేదికపై చాటేందుకు అమెరికా బయల్దేరి వెళ్లారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం, ఇంటింటికి సురక్షిత మంచినీరు అందిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ఫలితాలను అమెరికాలోని నెవడారాష్ట్రం లోని హెండర్సన్ జరుగుతున్న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో వివరించనున్నారు తెలంగాణ సాగునీటి రంగం లో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ గేమ్ ఛేంజర్ అని ప్రశంసలు అందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును స్వల్ప కాలంలోనే పూర్తి చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన అమెరికన్ సివిల్ ఇంజనీర్స్ సొసైటీ సంస్థ, ఆ విజయగాథను వివరించేందుకు కేటీఆర్ కు ఆహ్వానం పంపించింది.
అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి హాజరయ్యే సివిల్ ఇంజనీర్ల సమక్షంలో మంత్రి కేటీఆర్, సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశం అవుతారు. ఈ నెల చివరి వారం వరకు కొనసాగే ఈ పర్యటనలో పలు అమెరికన్ కంపెనీలు తమ పెట్టుబడి ప్రకటనలను చేసే అవకాశం ఉంది.