కుతుబ్ మినార్ ఉన్నప్రదేశంలో హిందూ ఆలయాన్ని పునరుద్ధరించాలన్న అభ్యర్థనను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తోసిపుచ్చింది. ఈ కేసులో ఏఎస్ఐ సాకేత్ కోర్టుకు ప్రత్యుత్తరం సమర్పించింది. కుతుబ్ మినార్ స్మారక చిహ్నాన్ని విష్ణు స్తంభ్గా మార్చాలని డిమాండ్ చేస్తూ హిందూ పిటిషనర్లు సాకేత్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే అది కుదరదని స్పష్టం చేసిన ఏఎస్ఐ.
కుతుబ్ మినార్ 1914 నుంచి ఓ స్మారక చిహ్నంగా ఉందని, దీని నిర్మాణాన్ని ఇప్పుడు మార్చలేమనీ అంది. కుతుబ్ మినార్కు రక్షిత హోదాను మంజూరు చేసే సమయంలో స్మారక చిహ్నం వద్ద ఆరాధన పునరుద్ధరణకు అనుమతించబోమని స్పష్టం చేసింది. హిందూ పిటిషనర్ల అభ్యర్థన చట్టపరం కాదని ఆర్కియాలజీ శాఖ తెలిపింది. అక్కడ పూజలు చేసే హక్కు ఎవరికీ లేదంది.
కుతుబ్ మినార్ రాజా విక్రమాదిత్య నిర్మించారని, దీనికి విష్ణు స్తంభం అని పేరని వీహెచ్పీ సహా హిందూసంఘాలు వాదిస్తూ వస్తున్నాయి. కాగా మసీదు నుంచి 15 మీటర్ల దూరంలో మినార్ కు దక్షిణాన తవ్వకాలు ప్రారంభించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తాజాగా నిర్ణయించారు. తవ్వకాల నివేదికను సమర్పించాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏఎస్ఐని కోరింది.యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది కుతుబ్ మినార్. ఇటీవలే దాన్ని విష్ణుస్తంభంగా మార్చాలంటూ… మహాకాల్ మానవ్ సేవ, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలపడంతో నాటినుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.