వందేమాతరం పాడేందుకు నిరాకరించారు బిహార్ కు చెందిన ఓ ఎంఐఎం ఎమ్మెల్యే. గతంలో హిందుస్థాన్ పదంపై అభ్యంతరం వ్యక్తం చేయగా..తాజాగా ఇమామ్ వందేమాతరం పాడబోననడం వివాదాస్పదమైంది. ఇమామ్ ఎంఐఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. వందేమాతరం తనకు వ్యతిరేకమని.. తన మతవిశ్వాసాలకూ అది వ్యతిరేకమనీ అన్నాడు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రస్తుత బీహార్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రత్యేకంగా ప్రారంభించారు. శాసనసభ్యులందరూ ముందు జాతీయ గేయం ఆలపించారు . నేడు ముగింపు రోజు జాతీయ గేయం ఆలపించారు. సభ నుంచి బయటకు వచ్చిన బిహార్ ఎంఐఎం చీఫ్ మీడియాతో మాట్లాడుతూ అసలు జాతీయ గేయం ఎందుకు అని ప్రశ్నించడంతో అంతా ఖంగుతిన్నారు.
“ప్రతి వ్యక్తికి తన స్వంత ఇష్టాయిష్టాలుంటాయి. నన్ను ఎవరూ బలవంతం చేయలేరు ” అని ఇమామ్ వ్యాఖ్యానించారు. అసలు ప్రతీ సందర్భంలోనూ జాతీయ గేయాన్ని ఎందుకు పాడాలని ప్రశ్నించాడు. అసలు అలా పాడాలని ఎవరు చెప్పారనీ ప్రశ్నించారు. “కారణం లేకుండా జాతీయ గేయం పాడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో ఇలాంటివేమీ చెప్పలేదు. జాతీయ గేయం వందేమాతరం పాడడంలో నాకు సమస్య ఉంది. అది మా విశ్వాసం…నేను వందేమాతరం పాడను గాక పాడనని అన్నాడు.
బలవంతంగా ఈ సంప్రదాయాన్ని పాటింపచేస్తున్నారని స్పీకర్ పైనా మండిపడ్డారు సదరు ఎమ్మెల్యే. జాతీయ గేయాన్ని ఆలపించకపోవడం ‘యాంటీ-నేషనల్’ కాదా అని ఇమామ్ను ఒక విలేఖరి ప్రశ్నించగా… అలా అని ఎవరు చెప్పారని… జాతీయ గేయం పాడాలని రాజ్యాంగంలో లేదని…రాజ్యాంగాన్ని రాసిన వారికంటే మేధావులున్నారా అని తిరిగి ప్రశ్నించారు.
అయితే ఇమామ్ వ్యాఖ్యలపై ఇతర ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. జాతీయ గేయంపై అభ్యంతరం వ్యక్తం చేసే వ్యక్తి దేశంలో ఉండడానికి అర్హుడు కాదంటూ వ్యాఖ్యానించారు. ఇమామ్ భారతదేశాన్ని విభజించాలనుకునే జిహాదీ మనస్తత్వం కలిగిన వాడని…. బిజెపి ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ మండిపడ్డారు. అతనిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ‘హిందుస్థాన్’ అని పలకడాన్ని ఇమామ్ వ్యతిరేకించాడు.

File Photo