ఓవైపు కరోనా న్యూ వేరియంట్ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇవేవీ పట్టనట్టు భీమా కొరేగావ్ విజయాన్ని గుర్తు చేసుకుంటూ పుణె జిల్లా పెర్నేలోని ‘జయస్తంభ్’కు నాలుగు లక్షల మంది పోటెత్తారు. మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నరు. పలుచోట్ల నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది.అలాంటిది అధికారుల ఆంక్షల్ని సైతం లెక్కచేయకుండా నిర్వాహకులు కార్యక్రమం నిర్వహించారు.
204 వ వార్షికోత్సవం సందర్భంగా స్తూపాన్ని మెహర్ రెజిమెంటల్ చిహ్నాలతో అలంకరించారు. తమ కులం గెలుపునకు చిహ్నంగా జయస్తంభ్ ను దళితులు అభివర్ణిస్తున్నారు. 1818 జనవరి 1న భీమాకొరేగావ్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో పేష్వా సైన్యంపై బ్రిటీష్ సైన్యం విజయం సాధించింది. బ్రిటిష్ సైన్యంలో నాటి దళితులైన మహర్ కులస్తులు ఎక్కువగా ఉండి బ్రాహ్మణ వంశస్తులపై పేష్వాలపై సాధించిన విజయంగా పేర్కొంటూ విముక్తి పోరాటంగా నాటి యుద్ధాన్ని గుర్తు చేసుకుంటారు దళితులు. ఇక ఈ కార్యక్రమానికి పుణె మహానగర పరివాహన్ మహా మండల్ అన్ని జిల్లాలకు వందలాది బస్సులు నడిపింది. 60ఏళ్లపై బడిన వాళ్లు, పిల్లలు జయస్తంభ్ కు రావద్దని జిల్లా అధికారులు విజ్ఞప్తి చేసినా ఎవరూ వినలేదు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ లక్షలాది మందితో కార్యక్రమం నిర్వహించడం ఆందోళన కలిగిస్తోంది.