జియో 4G టెక్నాలజీ మొబైల్ సేవలు ప్రారంభమైన కొత్తలో అపరిమిత మొబైల్ డాటాను కొద్ది రోజులు ఉచితంగా ఇవ్వడం, ఆ తర్వాత కారు చౌకగా ఇవ్వడం తెలిసిందే.. అప్పట్లో ఎయిర్ టెల్, ఇతర కంపెనీలు 3G సేవలకు 1 జీబీ డాటా కోసం రూ.249 వసూలు చేసేవి, కొన్ని కంపెనీలు రూ.199 ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. జియో రాకతో గేమ్ రూల్స్ మారిపోయాయి. ప్రస్తుతం జియోలో ఎక్కువగా వినియోగంలో ఉన్న ప్యాక్ రూ.149కే 24 రోజుల పాటు రోజూ1 జీబీ డాటా (మొత్తం 24 జీబీ) అపరమిత కాల్స్.. చచ్చినట్లు అన్ని కంపెనీలు ఇదే తరహా ప్యాకేజీ ఇస్తున్నాయి..
అప్పట్లో ఒక మిత్రుడు జియో కనెక్షన్ తీసుకోడానికి నిరాకరించాడు. ఎందుకయ్యా అని అడిగితే.. ‘పెట్టుబడిదారులు, అంబానీ, మోదీ, గుజరాత్, లూటీ..’ అంటూ దండకం వినిపించాడు.. విచిత్రం ఏమిటంటే అతను రహస్యంగా జియో సెకండ్ సెటప్ (కనెక్షన్) వాడుతూ ఇంటర్నెట్, సోషల్ మీడియా సేవలు ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి ఒక రోజు నాకు దొరికిపోయాడు.. ‘ఇదేం సీక్రెట్ కాపురం నాయనా? నీ నీతుల దండకం ఏమైంది?’ అని నిలదీస్తే నీళ్లు నములుతూ ‘టెక్నాలజీ చౌకగా అందుబాటులో ఉంటే వాడకుండా ఉంటామా ఏటి?’ అంటూ ఇగిలించాడు..
ప్రస్తుత దేశంలో 5G టెక్నాలజీ రాకను కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.. వీరికి మిడిమిడి జూచా అనే నటి తోడైంది. 5Gతో రేడియేషన్ ముప్పు పెరుగుతుందని, అడ్డుకోవాలంటూ కోర్టుకెక్కింది.. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ టెక్నాలజీ ఫలాలను సమర్ధవంతంగా వాడుకుంటున్నాయి.. ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఎవరూ బస్సులు, కార్లు, విమానాలు ఎక్కడం లేదా?.. ఇంట్లో కూరగాయల కత్తి మాత్రం ప్రమాకరం కాదా? ప్రమాదాలు ఎప్పుడూ పొంచే ఉంటాయి. జాగ్రత్తగా వాడుకునే నేర్పరితనం ముఖ్యం అనే ఇంగితం అవసరం..
మన దేశంలో కంప్యూటర్లు వచ్చిన కొత్తలో ఉద్యోగాలు తగ్గిపోతాయంటూ కొన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.. మొబైల్ ఫోన్లు వచ్చిన కొత్తలో పబ్లిక్ టెలిఫోన్ బూత్లు మూతపడ్డాయి.. తప్పదు.. టెక్నాలజీని అడ్డుకోవం ఎవరి తరం కాదు.. మార్పులకు అనుగుణంగా కొత్త ఉద్యోగావకాలు ఎంచుకోవాలి.. లేకపోతే మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాం.. పోటీ ప్రపంచంలో వెనకబడపోతాం.. వీరందరి డిమాండ్లకు తలొగ్గిఉంటే మన దేశం ఇప్పుడు ఎలాంటి దుస్థితిలో ఉండేదో ఊహించుకోండి..
మన దేశానికి అణు రియాక్టర్లు వద్దు, రాకెట్లు వద్దు, టెక్నాలజీ వద్దు, వాటి ఫలితాలు మనకు వద్దు.. వద్దు.. వద్దు.. వద్దు.. కొత్తగా ఎవడూ కంపెనీలు పెట్టొద్దు.. అందరినీ ప్రభుత్వమే పోషిస్తూ సోమరిపోతులను తయారు చేయాలి..
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి మెంటల్ మెంటాలజీ, సైకో సైకాలజీ ఎవరికి ఉంటుంది?.. భారత్లో వీరు ఏవైతే వద్దంటున్నారో, అదే పని తమ పితృ దేశం చేస్తే మాత్రం జేజేలు కొడతారు. భారత దేశం ఎప్పుడూ వెనుకే ఉండాలి.. వారు భజన చేసే దేశాలు మాత్రమే ముందుకు దూసుకుపోవాలి..
-క్రాంతిదేవ్ మిత్రా