ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు జరుగుతున్నాయి. ప్రభుత్వాన్నిఅస్థిరపర్చే కుట్ర, కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్న అభియోగాలపై.. అధికార పార్టీ ఎంపీ, నర్సాపురం లోక్సభ నుంచి ఎన్నికైన రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో రఘురామకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు..తనకు రమేశ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయాలన్న విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. మధ్యేమార్గంగా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను వీడియో షూట్ చేసి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సీల్డ్ కవర్లో పంపాలని సూచించింది. అంతేకాకుండా వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడీషియల్ అధికారిని నియమించే బాధ్యతను తెలంగాణ హైకోర్టుకు అప్పగించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జ్యుడిషియల్ రిజిస్ట్రార్ నాగార్జునను జ్యుడిషియల్ అధికారిగా తెలంగాణ హైకోర్టు నియమించింది.