అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వైద్యుల సలహా మేరకే మందులు వాడాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభిప్రాయపడ్డారు ఆధునిక వైద్య విధానాలను అనుసరించి స్వస్థత పొందాలని ఆయన సూచించారు.
మూఢనమ్మకాలను, నాటు వైద్యాన్ని నమ్మ వద్దని ఆయన వివరించారు.
జిల్లా పోలీసు యంత్రాంగం తరపున బోథ్ మండలం పట్నాపూర్ గ్రామం నందు జిల్లా వైద్యశాఖ మరియు నిర్మల్ స్వప్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. మొదటగా జిల్లా ఎస్పీకి గ్రామ ప్రజలు డప్పు వాయిద్యాల నడుము స్వాగతం పలికి ఆహ్వానించారు. ముఖ్యంగా ఈ వైద్య శిబిరం నందు జనరల్ మెడిసిన్, యూరాలజీ, గైనకాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిషన్, ఆర్థోపెడిక్ లలో నిష్ణాతులైన వైద్య బృందం చే వైద్య చికిత్సలను అందజేయడం జరిగింది.ఈ వైద్య శిబిరం నందు బోథ్ మండలం పట్నాపూర్, ఇన్కర్పల్లి, సుర్దాపూర్ మేడిగుడ్ గ్రామ ల నుండి దాదాపు 250 మంది ఆదివాసి ప్రజలు పాల్గొని వైద్య చికిత్సలను పొందడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీలు వైద్యులను సంప్రదించిన తర్వాతనే మందులను, టాబ్లెట్లను, గోలీలను వాడాలని సూచించారు. అనవసరంగా జ్వరం టాబ్లెట్లు, నొప్పి టాబ్లెట్లను వాడటం వల్ల కిడ్నీ సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు సంభవిస్తాయని తెలిపారు. అనవసరంగా చిన్న సమస్యలకే మందులను వాడి లేని సమస్యలను కొని తెచ్చుకోకూడదు అన్నారు. అదేవిధంగా గ్రామాలలో ఎలాంటి వైద్య సహకారం వచ్చిన ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాలని బాబాలను, మూఢనమ్మకాలను, చెట్ల మందులను వాడడం శ్రేయస్కరం కాదని సూచించారు.
అదేవిధంగా ఆదివాసీలు గంజాయి కి దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గంజాయి వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా సమాజం మీద కూడా దుష్ఫలితాలు పడతాయని ఆయన విశ్లేషించారు. గంజాయి రవాణా వంటి వాటిలో యువత ఇరుక్కోవద్దని ఎస్పీ స్పష్టం చేశారు .
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, సీఐ ఏ వెంకటేశ్వర్ రావు, ఎస్సై ఎల్ ప్రవీణ్, అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ రవీంద్ర ప్రసాద్, ఏ జి పి పంతం శంకర్, డాక్టర్లు శశికాంత్, స్వప్న, మల్లేష్, సచిన్ బాబు, ధ్రువన్ కుమార్, రాహుల్, దినేష్, బోథ్ పీహెచ్సీ వైద్య సిబ్బంది, బోథ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.