హైదరాబాద్ పాతబస్తీలో మతోన్మాదులు రెచ్చిపోయారు. కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని మాంసం ముద్దలను శివాలయంలో పడవేశారు. స్థానికంగా ఇది కలకలం రేపుతోంది. టప్పచబుత్ర దగ్గరలోని కార్వాన్ హనుమాన్ మందిరంలో ఇది జరిగింది. ఆలయంలోపల ఉండే శివాలయంలో ఈ ఘోరానికి పాల్పడ్డారు. శివలింగం వెనుక భాగంలో గుర్తుతెలియని దుండగులు మాంసపు ముద్దను వేయడంతో ఉదయం దర్శనానికి వచ్చిన భక్తులు ఇది గమనించి ఆందోళనకు గురయ్యారు.
దీంతో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు, హిందువులు దేవాలయం వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం జరగాలని, నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ సిబ్బంది, భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలను అపవిత్రం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే అనేక చోట్ల ఇదే జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాంటి కేసుల్లో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పవిత్ర ఆలయాల్లో కొంతమంది కావాలని మాంసం పడేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక కార్పొరేటర్ కూడా మండిపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హైదరాబాద్ జాయింట్ సీపీ విక్రమ్ సింగ్ హెచ్చరించారు. సంఘటన స్థలాన్ని జాయింట్ సీపీ విక్రమ్ సింగ్ పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని, అక్కడ సీసీటీవీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మొత్తం మీద మతోన్మాదులే ఇలాంటి ఘటనకు పాల్పడ్డారని భావిస్తున్నారు. దీని మీద సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.