ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మీద విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో పాటించాల్సిన కనీస మర్యాదలు పాటించడం లేదన్న మాట వినిపిస్తోంది. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక రోజే వైయస్ జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు అనిపిస్తుంది.
మొన్నటి ఎన్నికల్లో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో… పార్టీ బలం పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు 175 సీట్లకు గాను ,, 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని నడిపించారు. అప్పట్లో అసెంబ్లీలో వైసిపి ఆడింది ఆట, పాడింది పాటగా పరిస్థితి సాగింది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో తక్కువ మంది సభ్యులతో అయినా పోరాడింది. చంద్రబాబుకి తోడుగా సీనియర్ ఎమ్మెల్యేలు అచ్చం నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్ వంటి నేతలు సభలో ఉండేవారు. సాంకేతిక అంశాల ఆధారంగా వైసిపి ప్రభుత్వం మీద పోరాడుతూ ఉండేవారు.
ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. వైసిపి బలం పూర్తిగా తగ్గిపోయి పదకొండు కే పరిమితం అయింది. అందులోనూ వైయస్ జగన్ తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమర్నాథ్ రెడ్డి తప్ప మిగిలిన ఎమ్మెల్యేలకు సభ వ్యవహారాల మీద పట్టు కాస్త తక్కువే అని చెప్పుకోవాలి. అటువంటి అప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వము మీద పోరాడాలి అంటే చాలా చాలా కసరత్తు అవసరం.
అసెంబ్లీ కార్యకలాపాల మొదటి రోజే ప్రమాణస్వీకారం చేపట్టారు. శాసనసభ్యులుగా ప్రమాణం చేసిన వైసీపీ సభ్యులు సభ నుంచి పక్కకు తప్పుకున్నారు. నిజానికి స్పీకర్ ఎన్నిక సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉండడం సంప్రదాయం. సాధారణంగా అధికార పార్టీకి చెందిన నాయకుడే స్పీకర్ గా ఎన్నికవుతారు. ఒకప్పుడు చాలా సౌమ్యంగా ఉండే నాయకుల్ని స్పీకర్ గా ఎంచుకునేవారు. కానీ కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీని అదుపు చేయగల దూకుడు ఉన్న నాయకుల్ని స్పీకర్ గా ఎంపిక చేస్తున్నారు. ఇది ప్రతి రాష్ట్రం అసెంబ్లీలోనూ జరుగుతున్నదే.
అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ని స్పీకర్ గా ఎన్నుకోవడం జరిగింది. స్పీకర్ ఎన్నిక పూర్తి అయిన తర్వాత సాధారణంగా ఆయన ని వెంటబెట్టుకుని, ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష పార్టీల నాయకులు స్పీకర్ పోడియం దగ్గరికి చేరుకుంటారు. అన్ని పార్టీల నాయకులు దగ్గర ఉండి స్పీకర్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. తర్వాత స్పీకర్ ని అభినందిస్తూ సభను సజావుగా నడిపించాలని కోరుతూ వివిధ పార్టీల నాయకులు అసెంబ్లీలో ప్రసంగాలు చేయాల్సి ఉంటుంది. ఇదంతా సభ మర్యాదలో ఒక భాగం.
కానీ వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మొదటి కార్యక్రమానికే డుమ్మా కొట్టారు. పులివెందులలో పని ఉందంటూ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. పార్టీ అధ్యక్షుడు పక్కకు తప్పుకున్నప్పుడు.. తామెందుకు అని వైసిపి ఎమ్మెల్యేలు కూడా సైడ్ అయిపోయారు. దీంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ని తీసుకెళ్లి కూర్చోబెట్టే పని తెలుగుదేశం జనసేన బిజెపి చేపట్టాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సత్య కుమార్, అచ్చెన్నాయుడు .. దగ్గరుండి ఆ పని చేశారు. స్పీకర్ కు నిరసన తెలియజేశాం అని వైసిపి భావించి ఉండొచ్చు కానీ మర్యాద తప్పారు అన్న చెడ్డ పేరు అయితే మిగిలిపోతుంది. రానున్న కాలంలో కచ్చితంగా స్పీకర్ తో మాట్లాడాల్సిందే, సభా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాల్సిందే. అటువంటి అప్పుడు మొదటి రోజే సున్నం పెట్టుకోవడం వైసీపీకి అంత మంచిది కాదు.