మరోసారి.. నిమ్మగడ్డదే పైచేయి
ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి న్యాయపోరాటంలో గెలిచారు. జగన్ ప్రభుత్వం మీద పైచేయి సాధించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగే సమయంలో రథసారథి ఎస్ ఇ సి యేనని హైకోర్టు స్పష్టం చేసింది. వాహనాల్లో ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చూస్తామని ఎస్ ఇ సి కి ప్రభుత్వం రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై నిమ్మగడ్డ 5 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అంతిమ నిర్ణయం అయనదే అని తేల్చి చెప్పింది. ఇది సీఎం జగన్ కు, ఆయన ప్రభుత్వానికి, పార్టీకి ఏమాత్రం మింగుడు పడని విషయం. కానీ కోర్టు ఆదేశం కాబట్టి అమలు చేయాల్సిందే.
ఏడాది క్రితం కరోనా వైరస్ కారణంగా స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేశారు. దీంతో ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు పలువురు మంత్రులు, వైసిపి నాయకులు. కానీ ఆయన పట్టువీడకుండా కోర్టుల్లో పోరాడి గెలిచారు. తనను హడావుడిగా తొలగించిన ప్రభుత్వం చేతనే నియామక ఉత్తర్వులు తెప్పించుకున్నారు. ఇప్పుడు ఎన్నికల విషయంలో కూడా ఆయన ఆదేశాలను పాటించాల్సిందే అని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు చెప్పాయి.