బిహార్లో నితీశ్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారధ్యంలోని ప్రభుత్వానికి జితిన్ రాం మాంఝీ పార్టీ హిందుస్థాన్ ఆవామ్ మోర్చా మద్దతు ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని ప్రకటించిన ఆ పార్టీ చీఫ్ సంతోష్ సుమన్ మద్దతు ఉపసంహరణ రేఖను గవర్నర్ కు సమర్పించనున్నట్టు తెలిపారు. అందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరామన్నారు.
నితీష్ కుమార్కు, జితిన్ రామ్ మాంఝీకి కొంతకాలంగా పడడం లేదు. కొన్నినెలల క్రితం ఢిల్లీలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. అప్పటినుంచి నితీష్ కు మాంఝీకి దూరం పెరుగుతూ వస్తోంది. బీజేపీ దగ్గరవుతున్నారంటూ అనుమానించిన నితీశ్ ఆయన్ని దూరం పెట్టారు. ఈనేపథ్యంలోనే మాంఝీ తనయుడు సంతోష్ సుమన్ గతవారం కేబినేట్ నుంచి వైదొలిగారు. తన పార్టీని జేడీయూలో విలీనం చేయాలని నితీష్ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. పార్టీని నిలబెట్టుకునేందుకే రాజీనామా చేశానన్నారు. ఎన్డీఏ ఆహ్వానిస్తే పరిశీలిస్తామని అన్నారు. ఇటీవల జేపీ నడ్డాను సైతం కలిశారు సంతోష్.
బిహార్ అసెంబ్లీలో హెచ్ఏఎంకు నలుగురు సభ్యుల బలం ఉంది.మొత్తం 243 సభ్యులుండగా…అధికార కూటమి బలం 160. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్తో పాటు మరో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి.