
అల్లర్లు, హింసాకాండతో అట్టుడికిన మణిపూర్లో శాంతిని పునరుద్ధరిస్తామని కేంద్రహోంమంత్రి అమితి షా అన్నారు.అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన రాష్ట్రానికి స్వయంగా వెళ్లారు. ప్రజాసంఘాలు, మహిళాబృందాలతో ఆయన సమావేశం అయ్యారు. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు అందరూ సహకరించాలన్నారు. శాంతిపునరుద్ధరణ ప్రయత్నాల్లో భాగంగా మైతి, కుకీ వర్గాల ప్రతినిధులతోనూ సమావేశం అయ్యారు.
నాలుగు రోజుల మణిపూర్ పర్యటనలో భాగంగా సోమవారంనాడు ఇంఫాల్ చేరుకున్న హోం మంత్రి ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్, ఆయన క్యాబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. మణిపూర్లో తలెత్తిన సవాళ్లు ఇంకా సమసిపోలేదని, సమస్యలు పరిష్కారానికి మరికొంత సమయం పడుతుందని , రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. మే 3న మైతీ, కుకీ తెగల మధ్య తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఇళ్లు విడిచిపెట్టి సహాయక శిబిరాలకు తరలివెళ్లారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రబలగాలు శ్రమిస్తున్నాయి.