కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన ఆరునెలలైనా కన్నడ ప్రజలు ఆయన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆయన్ని స్మరించుకుంటూ మంగళూరు పోలీసులు పునీత్ సంబ్రమ పేరిట కార్యక్రమం నిర్వహించారు.ఆయనకు ఘన నివాళులు అర్పించారు. డిపార్డ్ మెంట్ వ్యక్తులను ఆయన గౌరవించే తీరు, ఖాకీలతో మెదిలే విధానాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన లేరనే బాధ ఇక చాలిద్దామని…పునీత్ ఎప్పటికీ మనలోనే,మనమధ్యే ఉంటాడని కార్యక్రమానికి హాజరైన పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ అన్నారు. పునీత్ పుట్టుకతోనే స్టార్ అని, తాను మాత్రం సినిమాలోకి వచ్చాక స్టారయ్యాననీ శివరాజ్ అన్నారు. పోలీసులు పునీత్ పేరిట కార్యక్రమ నిర్వహించడం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉందన్నారు.ఈ సందర్భంగా పునీత్ నటించిన ఓ సినిమా పాటకు శివరాజ్కుమార్తో కలిసి మంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ , సహా ఇతర పోలీసులు డాన్స్ చేయడం ఆకర్షించింది.
ఇక బసవజయంతి సందర్భంగా చిత్రదుర్గ మురుఘామఠం పునీత్ కు బసవశ్రీ పురస్కారాన్ని అందజేసింది. పునీత్ భార్య అశ్వినీపునీత్ పురస్కారం స్వీకరించారు. మురుఘామఠాధిపతి డాక్టర్ శివమూర్తి స్వామీజీ పురస్కారంతో పాటు రూ. 5 లక్షల నగుదు, మెమొంటోను అందించారు. స్వామీజీ మాట్లాడుతూ కన్నడ కంఠీరవ రాజ్కుమార్ ముద్దుల తనయుడైన పునీత్ కన్నడ చలనచిత్ర రంగంలో మేటి నటుడిగానే కాక సమాజ సేవకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.