మంగళూరులో ఈనెల 19న జరిగిన కుక్కర్ బాంబు పేలుడు తమపనేనని ప్రకటించింది ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్. అంతేకాదు మరో దాడికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. అయితే IRC హెచ్చరికను తీవ్రంగా పరిగణించిన దర్యాప్తు సంస్థలు మూలాలు పట్టుకునే పనిలో పడ్డాయి. ఆ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి తమవాడేనని ప్రకటించిన సంస్థ..తమ లక్ష్యం కాద్రిలోని దేవాలయమని స్పష్టం చేసింది.
ఈసారి తమ ప్రయత్నం విఫలమైనంతమాత్రాన వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేసింది ఉగ్రసంస్థ. రాష్ట్ర, కేంద్ర బలగాలెన్ని ఉన్నా…దాడులు చేస్తామని ప్రకటించింది. మంగళూరు దాడి ఉగ్రవాద కుట్రేనని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నా… ఇప్పుడు ఐఆర్సీ చేసిన ప్రకటనను నిర్ధారించుకునే పనిలో పడ్డాయి. ఈ నెల 19న ఓ ఆటోలో ఈ బాంబు పేలుడు జరిగింది. దాడికి పాల్పడిన నిందితుడు తొలుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కార్యక్రమాన్ని, ఆ తర్వాత ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు నిర్వహించే చిల్డ్రన్స్ ఫెస్ట్ను లక్ష్యంగా బాంబుపేలుళ్లు జరపాలని పథకం రచించినట్టు దర్యాప్తులో వెల్లడైంది.