వరదబీభత్సంతో అల్లాడుతున్న పాకిస్తాన్లో లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఇదే సమయంలో బెలూచిస్తాన్లోని హిందువులు మానవత్వం చాటారు. ఓ గ్రామంలోని హిందూ మందిరంలో 300 మంది ముస్లింలకు ఆశ్రయం ఇచ్చారు. కచ్చి జిల్లాలోని జలాల్ ఖాన్ గ్రామంలో బాబా మాధవ్ దాస్ మందిరం ఉంది. నారి, బోలన్, లేహ్రి నదులు ఉప్పొంగడంతో ఈ గ్రామానికి మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో గ్రామస్థులు భయంగుప్పిట్లో ఉండిపోయారు. వారి ఇబ్బందిని గమనించిన మందిరం నిర్వాహకులు, అక్కడి హిందువులు వారందరికీ ఆశ్రయం ఇచ్చారు. భోజనవసతి కూడా కల్పించారు. వారితో పాటు పశుపక్ష్యాదులకూ అక్కడే ఆశ్రయం ఇచ్చారు.
జలాల్ ఖాన్ గ్రామంలోని హిందువులు చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస పోయారు. కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ మందిరాన్ని కాపాడుకుంటూ, ఇక్కడ ఉంటున్నాయి. బలూచిస్థాన్ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఆలయానికి వస్తుంటారు. వారికోసం అక్కడ ఏర్పాటు చేసిన గదుల్లో ఇప్పుడు ముస్లింలు ఆశ్రయం ఉంటున్నారు.