మోదీ అనగానే మనకందరికీ ఛాయ్ వాలా నుంచీ దేశ ప్రధానిగా ఎదిగిన గొప్ప వ్యక్తి
మోదీ అంటే పడనివారికి ఆయన ఎవరో 2002 దాకా తెలియనే తెలియదు! ఆ తరువాత కూడా యాంటీ మోదీ బ్యాచ్ ఆయన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. చేయదు కూడా!
మోదీ రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు… దశాబ్దాల పాటూ ఆరెస్సెస్, బీజేపీల్లో వివిధ హోదాల్లో ‘కర్తవ్యాన్ని’ నిర్వహించారు! భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు ‘ఫలితంపై ఆసక్తి లేకుండా కర్మ చేసుకుంటూ’ ముందుకొచ్చాడు! అందుకే, మన కర్మయోగి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయ్యాడు! కానీ, సీఎం, పీఎం కంటే ముందు మోదీ ఎవరు? ఏంటి?
మోదీ ఆరెస్సెస్ కోసం పని చేశాడు. బీజేపీలోకి వచ్చాడు. సీఎం అయ్యాడు. పీఎం అయ్యాడు. ఇంతే అనుకుంటే పొరపాటే! ఆయన 1980ల్లో ఆరెస్సెస్ కోసం, బీజేపీ కోసం ‘వాయిస్ ఆర్టిస్ట్’గా సేవలందించారు! ఎన్నో గంటల పాటూ శ్రమించి సంఘ్ కోసం, పార్టీ కోసం అనేక రకాల అంశాలు, పథకాలు, సమస్యలు, సందేశాలపై గొంతుక వినిపించేవారు. ఆయన గంభీరమైన స్వరం, స్పష్టమైన ఉచ్ఛారణ కారణంగా ఆరెస్సెస్ పెద్దలు, బీజేపీ పెద్దలు ‘వాయిస్ రికార్డింగ్స్’కి ఆయన్ని ఏరికోరి ఎంచుకునేవారు. ఎన్నికలప్పుడు అయితే వివిధ భారతీయ భాషల్లో ఆయన ఏకబిగిన వందలాది రికార్డింగ్స్ చేసేవారు. అవి దేశం నలుమూలలా మార్మోగేవి!
రికార్డింగ్ థియేటర్ లో ఎవరికీ కనిపించకుండానే కాదు… అందరి ముందు కూడా మోదీ మైక్ పట్టుకుని ఘాటైన ప్రశ్నలకి ధీటైన సమాధానాలు ఇచ్చేవారు! ఆయన ఎన్నో ఏళ్లు బీజేపీ పార్టీ స్పొక్స్ పర్సన్ గా వ్యవహరించారు. అప్పుడు మీడియా ప్రతినిధులకి ఫేవరెట్ బీజేపీ లీడర్ కూడా! ఎందుకంటే, ఎలాంటి ప్రశ్నకైనా ఆయన సంయమనం కోల్పోకుండా గట్టి సమాధానం ఇచ్చేవారు!
2002 గోద్రా అల్లర్ల తరువాత మీడియా వారికి సెక్యులర్ సెగ్గడ్డలు ముదరటంతో మోదీ కూడా వార్ని దూరం పెట్టటం ప్రారంభించారు. 2014 తరువాతైతే మరింత దూరం పెట్టేశారు. కానీ, ఒకప్పుడు ఆరెస్సెస్ కోసం, బీజేపీ కోసం తాను చేసిన వాయిస్ రికార్డింగ్ సేవని మాత్రం మరిచిపోలేదు!
ఇప్పుడు… ‘మన్ కీ బాత్’ పేరుతో… నేరుగా దేశ మొత్తాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ సందేశమిస్తున్నారు!
-జైచతుర్వేది