దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలపై పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ అనీస్ ఇబ్రహీంకు సహచరుడైన 40 ఏళ్ల పర్వేజ్ జుబేర్ వైద్ మెమన్ ను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేశామని.. కోర్టులో రిమాండ్ కోసం హాజరు పరచనున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు.
దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం, విదేశాల్లో ఉంటున్న అతని సహచరులు.. అక్రమ కార్యకలాపాల ద్వారా సంపాదించిన సొమ్మును భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని ఏటీఎస్ విచారణలో తేలింది. దావూద్ ఇబ్రహీం, అనీస్ ఇబ్రహీంలపై తాజాగా నమోదైన కేసు ఇది.
ఈ ముఠా భారతదేశంలోని నిషేధిత సంస్థలకు, వారి భారతీయ హ్యాండ్లర్ల ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిందితులకు కూడా డబ్బు అందించింది. అనీస్ ఇబ్రహీం, అతని సహచరుడిపై ఏటీఎస్ చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) లోని సెక్షన్లు 17, 18 కింద కాలాచౌకి పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేసింది. పక్కా సమాచారం మేరకు పోలీసులు పర్వేజ్ ను నిన్న ముంబైలోని అంధేరీ వెస్ట్లో అతని నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో అతడు MDMA, Ketamine, LSD వంటి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తేలింది. మాదకద్రవ్యాల వ్యాపారం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల నుంచి వచ్చిన నిధులను.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంస్థలకు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు అందించే కుట్రలో నిందితుడి ప్రమేయం ఉన్నట్లు తేలింది. నిందితుడికి దావూద్ ఇబ్రహీంతో చాలా ఏళ్లుగా సంబంధం ఉంది. కొన్నాళ్లుగా దుబాయ్లో ఉంటూ అక్కడ అక్రమ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం అనీస్ ఇబ్రహీంతో కలిసి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.