పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మూడోసారి సత్తా చాటిన తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టబోతోంది. అయితే పార్టీ విజయం సాధించినా అనూహ్యంగా అధినేత్రి మమత ఓడిపోయారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేపట్టినా ఆరునెలల్లో ఏదో ఒకస్థానం నుంచి మమత తప్పక గెలవాల్సి ఉంటుంది. అయితే దీదీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తుందనేది ప్రశ్న. అయితే మూడుస్థానాల నుంచి బరిలో దిగేందుకు ఆమెకు అవకాశాలున్నాయి. అందులో ఒకటి ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దాహ్ నియోజకవర్గం. అక్కడ ఈనెల 22న పోలింగ్ జరిగింది. అక్కడ టీఎంసీ అభ్యర్థి గెలిచారు. కానీ ఇటీవలే ఆ అభ్యర్థి మరణించారు. ఇక ఆర్ఎస్పీ అభ్యర్థి మృతితో జంగీపూర్, కాంగ్రెస్ అభ్యర్ధి మృతితో శంషేర్ గంజ్ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మూడు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే ఖర్దాహ్ నుంచి ఇప్పటికే టీఎంసీ విజయం సాధించింది కాబట్టి..దాన్నే సురక్షిత స్థానంగా ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఖర్దాహ్ ఎటూ తమకే దక్కుతుంది కనుక… జంగీపూర్, శంషేర్ గంజ్ల నుంచి పోటీ చేసి గెలిస్తే అదనంగా మరో స్థానాన్ని ఖాతాలో వేసుకోవచ్చనే వాదనా వినిపిస్తోంది పార్టీ వర్గాలనుంచి..చూడాలి మమత ఏ స్థానాన్ని ఎంచుకుంటారో…