ఇస్లామిక్ ఎజెండాను విద్యాలయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతోంది కేరళలోని మలప్పురం మున్సిపాలిటీ. ముస్లిం లీగ్ ఏలికలో ఉన్న ఆ పురపాలిక ‘మిషన్ 1000’ పేరుతో వేగంగా పనికానిచ్చేస్తోంది. మున్సిపాలిటీ నుంచి కనీసం వెయ్యిమంది విద్యార్థులు ఏటా జాతీయస్థాయిలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందేలా అన్నిరకాల సహాయసహకారాలు అందిస్తోంది. వాళ్లంతా ‘excellence gathering and guidance programme of the Municipality’ ప్రోగ్రామ్ లో భాగమై ఉంటారు.
ఈ ఏడాది ఒక్క డిల్లీ యూనివర్సిలోనే 40మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్టు జమాత్ ఇస్లామియా హింద్ ఆధ్వర్యంలో నడుస్తున్న మాధ్యమం వార్తాపత్రిక వెల్లడించింది. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన 40మందిలో అత్యధికులు మున్సిపాలిటీ ప్రాంతానికి చెందినవారు కాగా…కొందరు సమీపంలోని గ్రామాల వారు. మున్సిపాలిటీలోని విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ…వారికి అన్నివిధాలుగా ఫాలోఅప్ చేస్తూ క్లస్టర్ అప్రోచ్ ను కూడా రూపొందించింది.
మలప్పురం మున్సిపాలిటీ ముస్లిం లీగ్ పార్టీ చేతుల్లో ఉంది. ఔత్సాహిక , పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నట్టు, ప్రోత్సహిస్తున్నట్టు చెబుతున్నా… దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లోకి ఇస్లామిక్ ఎజెండాను జొప్పించడమే ముఖ్య ఉద్దేశ్యమనే ఆరోపణలు అక్కడినుంచే వినిపిస్తున్నాయి. తమ ఎజెండా అమలుకు పథకం ప్రకారం, వ్యూహాత్మకంగా అధికారయంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది.
జెఐఎచ్, పిఎఫ్ఐ, ముజాహిద్లు వంటి కేరళలోని ఇస్లామిస్ట్ సంస్థలు సెంట్రల్ యూనివర్శిటీలు, ఐఐటి లు, మెడికల్ ఇన్స్టిట్యూషన్లు, నేషనల్ లా స్కూల్స్, టిస్ వంటి భారతదేశంలోని ప్రముఖ సంస్థలలో తమ కమ్యూనిటీ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకోసం విద్యార్థులకు సహాయం చేయడానికి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్లు, ప్రీ-అడ్మిషన్ సపోర్ట్ సిస్టమ్ లను సమకూరుస్తున్నాయి .
ఆ కమ్యూనిటీకి చెందిన ఉపాధ్యాయులు, లెక్చరర్లు, కేంద్రప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నవారు, ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఔత్సాహిక విద్యార్థులను నిరంతరం కలుస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎక్కడెక్కడ అడ్మిషన్లు ఉన్నాయి. ఏ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి వంటి సమాచారాన్ని చేరవేసేందుకు ఆ కమ్యూనిటీకి చెందిన విద్యార్థినీ విద్యార్థుల కేసం ప్రత్యేక వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.
సోషల్మీడియా ద్వారా ముఖ్యంగా వాట్సప్ గ్రూపుల ద్వారా మెరుపువేగంతో సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇక ఆ కమ్యూనిటీలోని పేదల విద్య కోసం ఆర్థికంగా మద్దనిస్తున్నాయి. అందుకోసం కూడా ఇస్లామిక్ గ్రూపులు ఓ యంత్రాంగాన్నే సృష్టించాయి. దీంతో అనేక జాతీయ విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా అనేక సమస్యలూ వస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ వంటి కీలక నగరాలు, ముఖ్యమైన విద్యాసంస్థల్లో తీవ్ర విఘాతం కలుగుతోంది. కావాలనే అల్లర్లు సృష్టిస్తుండడంతో చాలానష్టం జరుగుతోంది. ఉదాహరణకు సీఏఏ ఆందోళనల సమయంలో పెద్దసంఖ్యలో ముస్లిం విద్యార్థులు కమ్యూనిస్టు పార్టీ అండతో ఆందోళనల్లో పాల్గొని ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసింది. అయితే ఆధారాలున్నా పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. బాధితులుగా వారిని చూపిస్తూ…మానవహక్కులంటూ ముందుకు వస్తున్నాయి కమ్యూనిస్టు పార్టీలు, ఆయా పార్టీల అనుబంధ సంఘాలు.
ఢిల్లీలో సీసీఏ అల్లర్లలో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది కేరళవారేనని తేలింది. ఇక తాజాగా త్రిపురలో ముస్లింలపై, మసీదులపై దాడులు జరిగాయని ప్రచారం జరిగింది. దాడులకు నిరసనగా ఢిల్లీలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో పాల్గొన్నవారంతా ముస్లింలే. వారిలోనూ ఎక్కువమంది కేరళకు చెందినవారేనని చెబుతున్నారు. అసలు త్రిపురలో ముస్లింలపై ఎలాంటి దాడీ జరగలేదని తేలింది. అవాస్తవాలు ప్రచారం చేసి అల్లర్లు రేపే కుట్ర చేసిన ఆరోపణలపై ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా.
దేశ సమగ్రతను, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని మతసంస్థలు దేశంలో కుట్రపన్నుతున్నాయన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఓ మున్సిపాలిటీ కేంద్రంగా అధికారయంత్రాంగమే ఇలాంటి పనులు చేస్తుండడం ఆందోళనకరం.