మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసింది. అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉందనే ఆరోపణలతో 8 గంటలపాటు విచారించిన అధికారులు అరెస్ట్ ను అధికారికంగా ప్రకటించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.దావూద్ గ్యాంగ్తో పాటు ఇతర మాఫియా ముఠాలతో ఆర్థిక లావాదేవీలున్నట్టు ఆరోపణలున్నాయి. వారినుంచి మాలిక్ భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు తెలిసింది.
అండర్ వరల్డ్తో ముడిపడి ఉన్న అంశాలకు సంబంధించిన PMLA కేసులో విచారణకు హాజరుకావల్సిందిగా మాలిక్ కు ఈడీ కొన్నిరోజుల క్రితమే సమన్లు జారీచేసింది. అరెస్ట్ ప్రకటించిన తరువాత కార్యాలయం నుంచి వైద్యపరీక్షల కోసం తరలించారు.
మాలిక్ అరెస్టును మంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. ఉదయం ఈడీ అధికారులు ఆయన్ని ఇంటి నుంచి తీసుకెళ్లారని… ఆయనతో పాటు అడ్వొకేట్ అమీర్ మాలిక్ వెళ్లారని..ఆయన తనయుడు కూడా వెంటే వెళ్లారని ట్వీట్ చేసింది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరియు అతని సహాయకులపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దక్షిణ ముంబైలో ఈడీ దాడులు నిర్వహించింది. దావూద్ ఇబ్రహీం దివంగత సోదరి హసీనా పార్కర్ , సోదరుడు ఇక్బాల్ కస్కర్ నివాసాలతో సహా ముంబైలోని దాదాపు తొమ్మిది చోట్ల ,థానేలోనూ ED దాడులు చేసింది. ఈ కేసులోనే థానె జైల్లో ఉన్న ఇక్బాల్ కస్కర్ ను కూడా ఏజెన్సీ కస్టడీలోకి తీసుకుంది. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కోర్టులో హాజరుపర్చింది.
మాలిక్ అరెస్ట్ పై మండిపడ్డారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపట్ల కక్షసాధిస్తూ కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ముస్లిం అయితే దావూద్ తో ముడిపెట్టడం బీజేపీకి వాళ్లకు అలవాటేనని… తాను మహారాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడూ దావూద్ తో తనపేరునూ ముడిపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు.
అటు సంజయ్ రౌత్ కూడా కేంద్ర సర్కారుపై మండిపడ్డారు. మాలిక్ ను తనింటినుంచి ఈడీ తీసుకెళ్లిన విధానం అభ్యంతరకరంగా ఉందని… 2024 తరువాత మిమ్మల్నీ అలాగే విచారిస్తామని గుర్తుంచుకోండని హెచ్చరించారు.
పేలుడు పదార్థాలు, మారణాయుధాలతో భారత్పై ఉగ్రదాడులకు ఇబ్రహీం ప్రణాళికలు రచిస్తున్నాడని ఫిబ్రవరి 19న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసను ప్రేరేపించే లక్ష్యంతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రణాళికాబద్ధమైన దాడిలో పాల్గొన్న వారందరికీ ఆర్థిక సహాయం అందించేందుకు హవాలా మార్గాల ద్వారా నిధులను బదిలీ చేస్తున్నాడని కూడా ప్రీమియర్ ఏజెన్సీ తెలిపింది. దేశ వ్యతిరేకకార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న దావూద్ మతాల మధ్య చిచ్చురేపే పథకం రచిస్తున్నాడని ఏజెన్సీ తెలిపింది.
నివేదికల ప్రకారం, ఇబ్రహీం, ఇక్బాల్ మిర్చి, ఛోటా షకీల్, పార్కర్ , జావేద్ చిక్నాలపై మనీలాండరింగ్ కేసు విచారణ సందర్భంగా లావాదేవీలు పరిశీలిస్తుంటే నవాబ్ మాలిక్ పేరు కనిపించింది. దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ముంబైలోని నాగ్పాడా, భేండి బజార్లో స్థిరాస్తి అమ్మకం , ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా అక్రమంగా పొందిన డబ్బుకు సంబంధించిన అనేక హవాలా లావాదేవీలను ఏజెన్సీ గుర్తించింది.
దావూద్ ఇబ్రహీం అతని అనుచరులు దేశానికి వ్యతిరేకంగా హవాలా లావాదేవీలు సాగిస్తుండడంతో పాటు.. తీవ్ర వాద కార్యకలాపాల్లోనూ పాల్గొంటున్నట్టు తెలిపింది. దావూద్ ఇబ్రహీం, అతని సహాయకులపై ఇప్పటికే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం UAPA… కింద కేసు నమోదైంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)