మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. 18 మందితో మహారాష్ట్ర కేబినెట్ కొలువుదీరింది. ముంబైలోని రాజ్భవన్ లో ఉదయం 11 గంటలకు అట్టహసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్సింగ్ కొశ్యారీ సమక్షంలో 18 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి వర్గంలో బీజేపీ నుంచి తొమ్మిది,షిండే వర్గం నుంచి 9 మందికి చోటు లభించింది. ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసిన 40 రోజుల తర్వాత కేబినెట్ విస్తరణ జరిగింది.
దాదా భుసే, శంభురాజ్ దేశాయ్, సందీపాన్ భుమరే, ఉదయ్ సామంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, గులాబ్రావ్ పాటిల్ సహా సంజయ్ రాథోడ్ లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం నుంచి ప్రమాణం చేశారు.
చంద్రకాంత్ పాటిల్,సుధీర్ మునగంటివార్, గిరీష్ మహాజన్, సురేశ్ ఖడే, రాధాకృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిత్ సహా అతుల్ సేవ్ లు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం నుంచి ప్రమాణం చేశారు.
కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీల సంకీర్ణ ‘మహావికాస్ అఘాడీ’ ప్రభుత్వం కూలిన అనంతరం జూన్ 30న సీఎంగా షిండే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.