తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మహాలక్ష్మి కార్యక్రమానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ గడ్డమీద నివసించే ఆడపడుచులు అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు దీంతో మహిళలు అన్నిచోట్లకు ప్రయాణం చేయడం తేలిక అవుతుందని ,, తద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇందుకు తగినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మహాలక్ష్మి పథకానికి పచ్చ జెండా ఊపారు అప్పటినుంచి ఆర్టీసీ బస్సులు మహిళలు ప్రయాణించడం అంతకంతకు పెరుగుతోంది.
ఎన్నికల ముందు అక్టోబర్ నవంబర్ మాసాలలో సగటున నెలకు 45 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 55 నుంచి 60 లక్షల దాకా ఉంటుంది. అందుకు తగినట్లుగా బస్సుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం ఆ విషయంలో పెద్దగా స్పందించడం లేదు. వాస్తవానికి కొంతకాలంగా ఆర్టీసీలో బస్సుల సంఖ్య అంతకు అంతకు తగ్గుతోంది. ఉదాహరణకు 2014వ సంవత్సరంలో 10, 479 బస్సులు ఉండగా ఇప్పుడు ఆ బస్సులు సంఖ్య 8574 కి పడిపోయింది. ప్రతి ఏడాది కాలం చెల్లిన బస్సుల్ని పక్కకు పంపించడం తప్పనిసరి. కనీసం వాటి స్థానంలో అయినా బస్సుల్ని ఏర్పాటు చేయాల్సి ఉంది కానీ ఆ విషయంలో ఆర్టీసీ ఎప్పటికప్పుడు విఫలమవుతోంది. గత మూడేళ్ల కాలంలో ఆర్టీసీలో చేరిన కొత్త బస్సుల సంఖ్య 133 మాత్రమే.
ఇక అసలు విషయానికి వద్దాం.. మహిళల ఉచిత ప్రయాణం కారణంగా ఆర్టిసి బస్సుల్లో రద్దీ పెరిగింది అన్న మాట స్పష్టం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాదు , వరంగల్ , కరీంనగర్ వంటి నగరాలకు చేరుకునే బస్సుల్లో ఇబ్బంది ఏర్పడుతోంది. చాలా సందర్భాల్లో బస్సు ప్రారంభమైన మొదటి రెండు మూడు గ్రామాల్లోని పూర్తిగా నిండిపోతుంది దీంతో తర్వాత గ్రామాల్లో ఓ మోస్తరు పట్టణాల్లో బస్సులు ఆగే పరిస్థితి లేదు. ఆయా గ్రామాల మీదుగా బస్సులు నడుస్తున్నాయి తప్పితే ప్రయాణికులకు ఎక్కించుకొనే పరిస్థితి లేదు. నగరాలకు ఆనుకుని ఉన్న గ్రామాల నుంచి చదువు కోసం వచ్చే విద్యార్థులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది బస్సులు ఆగకపోవడంతో దగ్గర పడిగాపులు పడాల్సి వస్తుంది. మహాలక్ష్మి పథకాన్ని నమ్ముకుని ఆర్టీసీ బస్సులు ఎక్కుదాం అనుకునే మహిళలకు కూడా ఇదే పరిస్థితి.
ఒకవైపు ఆర్టీసీ బస్సులకు డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. అందుకు తగినట్లుగా బస్సుల సంఖ్యను ఏమాత్రం పెంచడం లేదు.
ఆదాయం ఎక్కువగా వచ్చే విజయవాడ హైదరాబాద్ కర్నూలు హైదరాబాద్ వంటి రూట్లకు ఆర్టీసీ ప్రాధాన్యం ఇస్తోంది. అంతేకానీ ప్రజలకు అవసరమైన గ్రామీణ రోడ్లలోనూ పట్టణాల చుట్టుపక్కల బస్సుల సంఖ్యను తగ్గించే వేస్తోంది ఫలితంగా ప్రజలు ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారు.
తెలంగాణలో ఒక అంచనా ప్రకారం సుమారు 1500 గ్రామాలకు అసలు బస్సులే పోవడం లేదు. టిక్కెట్లు ఉండటం లేదు అన్న కారణం చూపించి డిపో మేనేజర్లు బస్సులను తీసేశారు. సుమారు నాలుగువేల పైగా గ్రామాలకు బస్సులు వెళుతున్నాయి కానీ అక్కడ ప్రయాణికులకు రవాణా సేవలు అందడం లేదు. ఈ పరిస్థితుల మీద స్థానిక ఎమ్మెల్యేలకు మహిళలు మొరపెట్టుకుంటున్నారు. స్థానిక డిపో మేనేజర్లకు చెబుతున్నప్పటికీ టిక్కెట్లు లేవు అన్న కారణం చూపించి సేవలు నిలిపివేస్తున్నారు. దీంతో ఆయా ఎమ్మెల్యేలు రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి బస్సులు ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తున్నారు.
మొత్తం మీద మహిళా సాధికారత కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిస్థాయిలో మహిళా లోకానికి బస్సు సేవలు అందడం లేదు ఈ సమస్యను అధిగమించాలి అంటే ప్రభుత్వ స్థాయిలోని చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పటిదాకా మహాలక్ష్ములు.. మన్నించండి..!