ఆక్రమణలకు గురైన ఆలయ భూములను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన తమిళనాడు ప్రభుత్వానికి మరో దెబ్బ తగిలింది. ఆక్రమణలకు గురైన పల్నన్కుప్పంలోని శ్రీ రామనాధేశ్వర దేవాలయం భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు ప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వ హిందూ మత, ధర్మాదాయ శాఖ (హెచ్ఆర్ అండ్ సీఈ)పై మద్రాస్ హైకోర్టు వెకేషన్ బెంచ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
చెన్నై సమీపంలోని పల్నన్కుప్పంలోని శ్రీరామనాధేశ్వర ఆలయానికి చెందిన మూడున్నర ఎకరాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్ అండ్ సీఈ కమిషనర్ను ఆదేశించాలని కోరుతూ శ్రీ రామనాధేశ్వర ఆలయ భక్తుడు దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది కోర్టు.
ఆలయానికి ఎలాంటి అద్దె చెల్లించకుండా ఆలయ ఆస్తులను ఆక్రమిస్తున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆలయ భూమిని అక్రమంగా విక్రయించేందుకు ఆక్రమణదారులు యత్నించారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అందుకోసం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు నోటీసును డ్రా చేస్తూ, పిటిషనర్ ఆలయ ఆస్తులపై కొన్ని అక్రమ లావాదేవీలు జరిపారని.. దీనిని హెచ్ఆర్ & సీఈ సహా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. అయినప్పటికీ కమిషనర్ ఎటువంటి చర్య తీసుకోలేదని పేర్కొన్నారు.
పిటిషన్ ను పరిశీలించిన తర్వాత, ఆలయ భూములు, ఆస్తులను కాపాడేందుకు హెచ్ఆర్ అండ్ సీఈ శాఖ కట్టుబడి ఉందని జస్టిస్ సుబ్రమణ్యం అన్నారు. “అద్దె కూడా చెల్లించకుండా ఆలయ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయని పిటిషనర్ ఫిర్యాదు చేసినప్పుడు.. ఆలయ ఆస్తుల అన్యాక్రాంతానికి ప్రయత్నించినప్పుడు, అధికారులు విచారణ జరిపి తగిన చర్యలను ప్రారంభించాల్సిన బాధ్యత ఉంది”అని ఆయన ఆదేశించారు.
కొన్ని లావాదేవీలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పిటిషనర్ అఫిడవిట్లో వెల్లడించినట్లు ధర్మాసనం పేర్కొంది. ఆలయ ఆస్తులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని.. అలాగే ఆక్రమణదారులను తొలగించి ఆలయ ఆస్తులను తిరిగి పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్ & సీఈ కమిషనర్ను ఆదేశించింది. చట్ట ప్రకారం ఆర్డర్ కాపీ అందిన తేదీ నుంచి పన్నెండు వారాలలోగా కసరత్తు పూర్తి చేయాలని కమిషనర్కు గడువు కూడా ఇచ్చారు.
ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం, ఆక్రమణలకు గురైన భూములను తిరిగి తీసుకోవడం, అద్దెల బకాయిలు వసూలు చేయడం, ఆలయ నిధులు, ఆస్తులను దుర్వినియోగం కాకుండా కాపాడడంలో విఫలమైనందుకు హెచ్ఆర్ అండ్ సీఈ డిపార్ట్మెంట్ను కోర్టు కఠినంగా హెచ్చరించింది.
ఇలాగే నుంగంబాక్కంలోని అగతేశ్వర దేవాలయం ఆక్రమిత భూములను తిరిగి పొందడంలో విఫలమైనందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ను చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి విచారించారు.
ఇటీవల HR అండ్ CE ‘టెంపుల్ ప్రాపర్టీస్ రికవర్డ్ బై ది ఎండోమెంట్ బోర్డ్, 2021-2022’ అనే పుస్తకాని విడుదల చేసింది. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత రికవరీ చేసిన ఆలయ ఆస్తుల గురించి ఇందులో ప్రస్తావించారు.
పూనమల్లిలోని కాశీ విశ్వనాథస్వామి ఆలయానికి, వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 21 ఎకరాల స్థలంలో క్వీన్స్ల్యాండ్ అమ్యూజ్మెంట్ పార్క్ను తొలగించే ప్రక్రియను ప్రారంభించాలని గత ఏడాది అక్టోబర్లో మద్రాసు హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. వివాదాస్పద భూమి 1883లో ఆలయానికి ఇవ్వబడిన 254 ఎకరాల భూమి. రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఆలయానికి 1997లో ఒక్క పైసా కూడా చెల్లించకుండా ప్రభుత్వ ఆస్తులపై ప్రైవేట్ సంస్థను కబ్జా చేయడానికి అనుమతించరాదని జస్టిస్ ఎం.సుందర్ పేర్కొన్నారు.
ఇలాంటి విషయాలపై తమిళనాడు ప్రభుత్వానికి 75 ఆదేశాల జాబితాను జారీ చేసి.. న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, ద్రవిడపార్టీ ప్రభుత్వం తన మార్గాన్ని సరిదిద్దుకోలేదు.