భారత దేశం గర్వించదగిన ఇంజనీరింగ్ అద్భుతం చీనాబ్ బ్రిడ్జి. ఇందులో కీలక పాత్ర పోషించిన ముఖ్య ఇంజనీర్ గాలి మాధవీలత తెలుగు అమ్మాయి కావటం విశేషం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఈ వంతెన కు ప్రారంభోత్సవం చేశారు. కాశ్మీర్ ప్రగతి సాధనలో ఇది ఒక గేమ్ ఛేంజర్ అని ప్రధాని అభిప్రాయ పడ్డారు. పాకిస్థాన్ సరిహద్దులకు అతి సమీపంలో దీనిని నిర్మించారు. దీని ద్వారా జమ్ము కాశ్మీర్ లో రాక పోకలు చాలా చాలా దగ్గర అవుతాయి.
……
చీనాబ్ బ్రిడ్జికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన గా చెప్పవచ్చు. సుమారు రూ. 1,486 కోట్ల వ్యయంతో నిర్మించిన చీనాబ్ వంతెనను ‘భారతదేశ రైల్వే ప్రాజెక్టుల చరిత్రలోనే.. అతిపెద్ద సివిల్-ఇంజనీరింగ్ సవాలు’గా చెప్పవచ్చు. ఈ వంతెన 359 మీటర్ల ఎత్తుతో అత్యంత ఎత్తులో నిలుస్తోంది. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వంతెన నిర్మాణం ద్వారా కాశ్మీర్ లోయ వాసులు భారత్ కు చేరాలంటే దూరం చాలా చాలా తగ్గిపోతుంది. హిమాలయాల్లో రెండు ఎత్తయిన పర్వతాల మధ్య దీనిని నిర్మించారు. కింద చీనాబ్ నది వేగంగా ప్రవహిస్తుంటే, అందులో ఎటువంటి పిల్లర్ వేయకుండా, నేరుగా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రపంచమంతా ఆశ్యర్యపోయేలా అద్భుతమైన తరహాలో మన ఇంజనీర్లు ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
….
ఇంతటి ఘనత లో తెలుగు అమ్మాయి మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు కి చెందిన మాధవి.. చిన్నతనం అంతా అక్కడే గడిచింది. స్కూలింగ్, ఇంటర్మీడియట్ దాకా సాధారణ ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీల్లోనే చదువుకొన్నారు. కాకినాడ జే ఎన్ టీ యూ క్యాంపస్ లలో బీ టెక్ పూర్తి చేశారు. ఇప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అంతా ప్రకాశం జిల్లా లోని పల్లెసీమల్లో కనిపిస్తారు. మొదట నుంచీ ఆమె కు మన తెలుగు తనం, తెలుగు సాంప్రదాయం అంటే ఇష్టం. మరో తెలుగు ఇంజనీర్ హరిప్రసాద్ ను వివాహం చేసుకొన్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.
…
చదువులో మాధవీలత టాప్ ర్యాంకర్ అని చెప్పుకోవాలి. వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎంటెక్ చేసి, గోల్డ్ మెడల్ సాధించారు. ఐఐటీ-మద్రాస్ నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్లోనే డాక్టరేట్ పొందారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు వరించాయి. 2021లో ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ నుంచి ‘బెస్ట్ ఉమెన్ జియోటెక్నికల్ రీసెర్చర్’ అవార్డు అందుకున్నారు. 2022లో ‘టాప్ 75 ఉమెన్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా’ జాబితాలో కూడా స్థానం సంపాదించారు. ఇంజనీరింగ్ రీసెర్చ్ లో దేశంలోనే టాప్ సైంటిస్ట్ గా పేరు తెచ్చుకొన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే, చీనాబ్ ప్రాజెక్టు మరో ఎత్తు.
…
చీనాబ్ బ్రిడ్జి ప్రాజెక్టు ను టేకప్ చేశాక మాధవీలత చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. అక్కడకు వెళ్లటానికి సరైన దారి ఉండేది కాదు. ఒకసారి ప్రాజెక్టు ప్లేస్ కు వెళితే తిరిగి వెనక్కి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి ఉండేది. పెళ్లయిన కొత్త లో అప్పుడే బిడ్డ పుట్టిన సమయంలో ఈ ప్రాజెక్టు కి అపాయింట్ అయ్యారు. కాశ్మీర్ లోయల్లో అప్పుడు సంక్లిష్ట పరిస్థితులు ఉండేవి. సరైన భద్రత కూడా లేని పరిస్థితుల్లో దేశం కోసం ఆమె తీవ్రంగా శ్రమించారు. ఏడాది వయస్సు ఉన్న బిడ్డను స్వగ్రామంలో ఉంచి, దేశ సరిహద్దుల్లో ప్రాజెక్టు పనిలో నిమగ్నం అయ్యారు. ఇలా ఒకటి, రెండు కాదు.. 17 సంవత్సరాలకు పైగా చీనాబ్ బ్రిడ్జి నిర్మాణంలోనే ఉండిపోయారు.
…
ఒక రకంగా చెప్పాలంటే, కెరీర్ జీవితం అంతా చీనాబ్ బ్రిడ్జి కోసమే మాధవీలత త్యాగం చేశారు. అక్కడ క్లిష్టమైన భూభాగం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మారుమూల ప్రదేశం కావడం వంటి అంశాలు నిర్మాణాన్ని అత్యంత సవాలుగా మార్చాయి. మొదట్లో ప్రణాళిక, డిజైన్ మరియు నిర్మాణ దశల్లో భూసంబంధమైన ఆటంకాలను అధిగమించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. చుట్టూ ఎత్తయిన పర్వతాలు, మధ్యలో లోతైన నదీ.. ఈ ప్రాంతంలో బ్రిడ్జిని నిర్మించాలి అంటే మాటలు కాదు. ఇందుకోసం.. ఆమె బృందం ‘డిజైన్ యాజ్ యూ గో’ అనే వినూత్న విధానాన్ని అనుసరించింది. ప్రాథమిక సర్వేలలో కనిపించని విరిగిన రాళ్లు, రహస్య ఖాళీ ప్రదేశాలు, వివిధ రకాల రాతి లక్షణాలు వంటి వాస్తవ భూగర్భ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డిజైన్లో మార్పులు చేస్తూ ముందుకు సాగారు. నిర్మాణ సమయంలో ఎదురైన యథార్థ రాతి పరిస్థితులకు అనుగుణంగా సంక్లిష్టమైన గణనలు, డిజైన్ సవరణలు చేశారు. చివరకు ఈ మార్గంలో యాజ్ యూ గో పేరుతో మాధవీలత ఒక రీసెర్చ్ పేపర్ ను కూడా ప్రచురించారు.
…
మొదట్లో ఈ వంతెన నిర్మాణం మందగొడిగా సాగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాక పాకిస్తాన్ సరిహద్దుల్లో బ్రిడ్జి ల నిర్మాణం మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. మాధవీలత వంటి సైంటిస్టులకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి ప్రాజెక్టుని ముందుకు నడిపించారు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, మిలటరీ అధికారులు సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగారు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రగతిని నివేదిస్తూ, వనరులు సమకూర్చుకొంటూ ముందుకు సాగారు. ఇప్పుడు ప్రపంచం గర్వించదగిన స్థాయిలో అద్బుతాన్ని సాకారం చేశారు. ఇందులో కీలక పాత్ర పోషించిన మాధవీలత ప్రస్తానం.. తెలుగు అమ్మాయిలకు స్ఫూర్తి దాయకం.