ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు వాడి వేడిగా ఉంటాయి. రాజకీయపు ఎత్తుగడలతో పార్టీలు.. నాయకులు పోటీ పడుతూ ఉంటారు. కానీ ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. వైసిపి పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయాక పోయాక ఆ పార్టీ నాయకుల్లో పూర్తి నిరాశ ఏర్పడిపోయింది. ఇప్పట్లో పార్టీ కోలుకోవడం కష్టం అన్న భావన వచ్చేసింది.
మరోవైపు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉత్సాహంగా ముందుకి కదులుతోంది. తెలుగుదేశం, జనసేన, బిజెపి క్యాడర్ కలిసిపోయి కలిసికట్టుగా ఎన్నికల్లో పోరాడారు అనేది సుస్పష్టం. దీంతో అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ పార్టీల నాయకులు కలిసి ముందుకు సాగుతున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి నాయకత్వం మధ్య కూడా ఇదే స్నేహభావం కొనసాగుతోంది. సంకీర్ణం అనగానే సహజంగానే లుకలుకలకు నెలవు అన్న సాధారణ అభిప్రాయం ఉంది. కాని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం..పేరుకే కూటమి ప్రభుత్వం గాని ఏకపార్టీ ప్రభుత్వమన్నంతగా ఒకే మాట-ఒకే బాటగా సాగుతున్నది. ముఖ్యంగా జనసేన పార్టీ , బీజేపీ పార్టీ… చంద్రబాబు రాజకీయ, పాలనానుభవానికి, దార్శనికతకు ఇస్తున్న గౌరవం అందర్నీ విస్మయానికి గురి చేస్తున్నది.ముఖ్యంగా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇస్తున్నంత నైతిక మద్దతు మరే సంకీర్ణంలోనూ మరెవ్వరూ ఇచ్చి ఉండరన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇది చంద్రబాబుని మరింత శక్తిమంతుడిగా చేస్తున్నది. వైసిపి పాలనలో తమ కేడర్ మీద జరిగిన అరాచకాలకు రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలన్న ఒత్తిళ్లు మూడు పార్టీల్లోనూ వ్యక్తమవుతున్న దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీకార దాడులను సహించబోనని నిర్మొహమాటంగా చెప్పడం, దాన్ని పవన్ కల్యాణ్ బలపరచటం విశేషం. అంతేకాదు. తమ పార్టీ నుంచి అలాంటి ప్రతీకార దాడులకు అనుమతివ్వబోనని, మీ మాటే ఫైనల్ అని అసెంబ్లీలోనే ప్రకటించడం ద్వారా పవన్ కల్యాణ్ మిత్రధర్మానికి సరికొత్త నిర్వచనం చెప్పారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అటు బిజెపి నాయకత్వం నుంచి కూడా బలమైన మద్దతు లభిస్తోంది. కేంద్రంలో ప్రధాని మోడీ సంకీర్ణ ధర్మంలో భాగంగా చంద్రబాబు-పవన్ ద్వయానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలోనూ పవన్ కల్యాణ్కు చంద్రబాబు అదే రీతి గౌరవం, ప్రాధాన్యత ఇస్తున్నారు .సంకీర్ణ రాజకీయాల్లో సామరస్య వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో మూడు పార్టీల మధ్య చక్కటి సమన్వయం స్పష్టంగా కనిపించింది. అరమరికలు లేకుండా ఒకే పార్టీ శాసనసభ్యులు మాదిరిగా కలిసిపోయి వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం సభ్యులకంటే కూడా జనసేన బిజెపి ఎమ్మెల్యేలు తెలుగుదేశం స్ఫూర్తిని బలంగా ముందుకు తీసుకుని వెళ్లారు.
సాధారణంగా అధికార పార్టీ కూటమిలో లుకలుకలు ఉంటాయి . ప్రతిపక్షాలన్నీ పోరాడేందుకు ఏకతాటి మీదకి వస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అధికార కూటమి లోని మూడు పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయి. కానీ ప్రతిపక్ష పార్టీలు అయిన వైసీపీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు… వాళ్లలో వాళ్లు తిట్టుకుంటున్నారు .. తలో దారిలో ప్రయాణిస్తున్నారు. ఇదొక విచిత్ర పరిస్థితి అనుకోవచ్చు.