నలుగురు కాంగ్రెస్ లోక్సభ సభ్యుల సస్పెన్షన్ను స్పీకర్ ఓం బిర్లా ఈరోజు రద్దు చేశారు. అయితే మళ్లీ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఓం బిర్లా హెచ్చరించారు. జులై 25న ప్లకార్డులు, పోస్టర్లతో నినాదాలు చేసినందుకు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జోతిమణి, టీఎన్ ప్రతాపన్ లను సస్పెండ్ చేశారు. అంతకుముందు సభ కొనసాగే ముందు బిర్లా.. నేతల అఖిలపక్ష సమావేశాన్ని పిలిచారు. స్పీకర్ కోరడంతో నలుగురు ఎంపీల సస్పెన్షన్ను రద్దు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకొచ్చింది.
సభలో జరిగిన సంఘటనల వల్ల అందరూ బాధపడ్డారు. నేను కూడా బాధపడ్డాను, దేశం కూడా బాధపడిందని ఓం బిర్లా అన్నారు. దేశంలో అత్యున్నత ప్రజాస్వామ్య సంస్థ పార్లమెంటు. ఇక్కడి పార్లమెంటరీ సంప్రదాయం గురించి మనమందరం గర్విస్తున్నాం. ఈ గౌరవాన్ని, మర్యాదను కాపాడుకోవడం మన సమిష్టి బాధ్యత అని సభ్యులతో అన్నారు. ఇక్కడ చర్చించుకునే విషయాలను అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు.. కానీ సభ గౌరవాన్ని కాపాడుకోవాలని.. అన్ని పార్టీల నాయకులు, సభ్యులు సభ నడవాలనుకున్నారు. సభ నడుస్తుంటే అందరికీ తగినంత సమయం, అవకాశం ఇస్తాను అని బిర్లా అన్నారు.