సినిమాలో హీరోల పాత్రల ప్రభావం అభిమానులపై పడుతుందా అంటే అవుననే చెప్పవచ్చు. ఆ మధ్య వచ్చిన మహేశ్ బాబు సినిమా శ్రీమంతుడు చూసి ఎందరో ప్రభావితం అయ్యారు. రాజకీయనాయకులు మొదలు సామాన్యుల వరకు తమ సొంతగ్రామాలనో..ఏదైనా వెనకబడిన పల్లెనో దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. ఇంతవరకూ సరే కానీ నెగెటివ్ ప్రభావం పడితే. ఎందుకంటే ఇటీవల కొన్ని సినిమాలు పూర్తిగా నెగెటివ్ సందేశంతో వస్తున్నాయి. వాటిల్లో చెప్పుకోదగిన మూవీ ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయిన పుష్ప. అల్లుఅర్జన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఇక సినిమాలోని ఓ పాట. అందుకోసం నటుడు చేసిన డ్యాన్స్ ను లక్షలాది మంది అనుసరిస్తున్నారు. సినీ తారలు, క్రికెటర్లు సహా ఇతర సెలబ్రిటీలూ పుష్ప డైలాగులు, డ్యాన్సులతో ఊదరగొడుతున్నారు.
అయితే ఓ అడుగు ముందుకేసి …పుష్ప హీరో తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు ఓ వ్యక్తి. బెంగళూరులో ఆ సినిమా చూసి స్ఫూర్తి పొంది సినిమా స్టైల్లో అచ్చంగా అలాగే రెడ్ శాండల్ అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయాడు.
బెంగళూరుకు చెందిన యాసిన్ ఇనయితుల్లా ట్రక్కు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే పుష్ప సినిమా చూసిన అతను…సినిమాలోలా నిజంగా తన ట్రక్కులో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయాలనుకున్నాడు. కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు నుంచి మహారాష్ట్ర స్మగ్లింగ్ చేస్తూ మార్గమధ్యంలో పోలీసులకు పట్టుబట్టాడు. సరిహద్దు దాటుతుండగా… సాంగ్లీ జిల్లాలోని మీరజ్ నగర్ గాంధీ చౌక్లో మహారాష్ట్ర పోలీసులు అతన్ని పట్టుకున్నారు.2 కోట్ల 45 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలతో పాటు… 10లక్షల విలువైన ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణా గురించి సమాచారం అందగానే … అటవీ అధికారులతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ట్రక్కును స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు.
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ మొదట ట్రక్కులో కలపను ఎక్కించి, పైన పాలక్యాన్లు ఉంచుతాడు. అలాగే యాసిన్ మొదట ఎర్రచందనాన్ని ఎక్కించాడు… దాని పైన పండ్లు మరియు కూరగాయల పెట్టెలను పేర్చాడు. ట్రక్కు డోరుమీద COVID-19 సామగ్రి అని స్టిక్కర్ అంటించాడు.
ఇన్ని జాగ్రత్తలతో పోలీసులకు చిక్కకుండా కర్నాటక సరిహద్దు దాటిన స్మగ్లర్.. మహారాష్ట్ర బోర్డర్ దాటుతూ ఆ పోలీసులకు చిక్కాడు. అయితే అతను ఎంతకాలంగా స్మగ్లింగ్ చేస్తున్నాడు..వెనక ఎవరు ఉన్నారనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.