ఢిల్లీలోని షహీన్ భాగ్ లో అక్రమ కట్టడాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించబోమని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది. దీనిపై రాజకీయ పార్టీ ఎందుకు పిటిషన్ దాఖలు చేసిందని ప్రశ్నించింది. ఈ విషయంతో తాము జోక్యం చేసుకోబోమని, ఏదైనా ఉంటే ఢిల్లీ హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది.
షాహీన్ భాగ్ లోని కలింది కుంజ్, జామియా నగర్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సోమవారం ఉదయం సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (SDMC) అధికారులు బుల్డోజర్లతో చేరుకున్నారు. గత ఘటనల దృష్ట్యా ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూల్చివేతల కోసం జేసీబీలను తరలించింది.
అయితే బుల్డోజర్లను స్థానికులు అడ్డుకున్నారు. ఎస్డీఎంసీ ఆదేశాలను వ్యతిరికిస్తూ నిరసన చేపట్టారు. ఈ నిరసనలో స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో షహీన్ భాగ్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు మహిళలు బుల్డోజర్లకు ఎదురెళ్లడంతో అధికారులు వెనక్కి తగ్గారు. బుల్డోజర్లను అక్కడి నుంచి వెనక్కి పంపించారు. షహీన్ భాగ్ దగ్గర కూల్చివేతలకు వ్యతిరేకంగా సీపీఎం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు, బి. ఆర్. గవాయ్ లతో కూడిన ధర్మాసనం.. పిటిషనర్లపై అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ ను పార్టీ ఎందుకు వేసింది? బాధిత వ్యక్తులు పిటిషన్ వేస్తే ఓ అర్థం ఉంటుంది. ఓ రాజకీయ పార్టీ వచ్చి మేం ఏం చేయాలో చెప్పాలని చూస్తోందా? అక్రమంగా కట్టిన మా ఇంటిని కూల్చేస్తున్నారంటూ సుప్రీం కోర్ట్ కు రావడానికి మేం ఎవరికీ లైసెన్స్ లు ఇవ్వలేదు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మేం తప్పకుండా జోక్యం చేసుకుంటాం. కానీ రాజకీయ పార్టీ కోరిక మేరకు చర్యలు చేపట్టలేం. ఇలాంటి పిటిషన్ లు వేయకండి అని మందలిస్తూ… ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేస్తున్నట్టు వెల్లడించింది. వ్యతిరేకంగా ఏదైనా జరిగితే బాధిత వ్యక్తులు హై కోర్టుకు వెళ్లొచ్చని చెప్పింది.