దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశం… ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల వ్యవహారం. మోదీ విద్యార్థుల కేసులో శుక్రవారం గుజరాత్ హైకోర్టు కీలకతీర్పు వెలువరించడమే ఇందుకు కారణం. మోదీ విద్యార్హతల సర్టిఫికెట్లను… బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి.
మోదీ విద్యార్హతలకు సంబంధించిన వ్యవహారంలో వివరాలు పరిశీలిద్దాం. మోదీ విద్యార్హతలు చెప్పాలంటూ… కేంద్ర సమాచార కమిషనర్ కు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్… 2016లో లేఖ రాశారు. కేజ్రీవాల్ దరఖాస్తుకు సమాచార కమిషనర్ సమాధానం చెప్పారు. మోదీ గుజరాత్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పీజీ చేశారని తెలిపారు. మోదీ విద్యార్హతల వివరాలను వెల్లడించాలంటూ గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించారు.
మరోవైపు… మోదీ విద్యార్హత సర్టిఫికెట్లను వెబ్ సైట్లో పెట్టాలని కోరుతూ దిల్లీ విశ్వవిద్యాలయం వీసీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో… మోదీ విద్యార్హత సర్టిఫికెట్లను వెల్లడించాలని పీఎంవో, గుజరాత్, ఢిల్లీ విశ్వవిద్యాలయాలను సమాచార కమిషనర్ ఆదేశించారు. అయితే… సమాచార కమిషనర్ ఆదేశాలను గుజరాత్ విశ్వవిద్యాలయం… ఆ రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేసింది. గుజరాత్ విశ్వవిద్యాలయం పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు… మోడీ విద్యార్హత సర్టిఫికెట్లను వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ కు రూ.25000 జరిమానా విధించింది.
ఇక ఈ వ్యవహారంపై నెలకొన్న రాజకీయ దుమారాన్ని పరిశీలిద్దాం. దేశ ప్రధాని విద్యార్హతలను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని… అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే మోదీ సర్టిఫికెట్లు బయటపెట్టాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ క్యాంపెయిన్ చేస్తోంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై విపక్ష నేతలు అభ్యంతరం చెబుతున్నారు. మోదీ విద్యార్హతలను వెల్లడించడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. తాను పూణేలో, అమెరికాలో పీజీలు చేశానని, కావాలంటే సర్టిఫికెట్లు బయటపెడతానని అన్నారు. పరోక్షంగా మోదీని ఉద్దేశించి వ్యంగంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు బిజెపి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు స్టార్ట్ చేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా గుజరాత్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తున్నారు. ప్రధాని నిరక్షరాస్యుడా, డాక్టరేట్ హోల్డరా అనే తేడా ఉండదని కోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మోదీ సర్టిఫికెట్లు బయటపెట్టాలని కోరడంలో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని న్యాయస్థానం చెప్పిన విషయాన్ని హైలెట్ చేస్తున్నారు.
మోదీ విద్యార్హతల సంగతి పక్కన పెడితే… నేతల ఆస్తుల వివరాలు కూడా బయట పెట్టాల్సిన అవసరం లేదా అని బిజెపి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత ఆస్తుల్లో భారీ వ్యత్యాసం ఎందుకు ఉంటుందో చెప్పాలని నిలదీస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని మ… అక్రమంగా కూడ పెట్టుకుని… ప్రధానిపై విమర్శలు చేయడం ఆపాలంటూ కమలం పార్టీ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. గుజరాత్ హైకోర్టు తీర్పు తర్వాత మోదీ విద్యార్హతల వ్యవహారం సద్దుమణిగింది. మరోవైపు… సోషల్ మీడియా వేదికగా… నేతల ఆస్తుల వివరాలు బయటపెట్టాలంటూ కొత్త డిమాండ్ వినిపిస్తోంది. నేతల చదువు గురించేనా… సంపాదన గురించి కూడా అడుగుదాం అంటూ నెటిజెన్లు చైతన్యం ప్రదర్శిస్తున్నారు.