భగత్ సింగ్ పేరు చెప్పగానే మన దేశ యువతరం హృదయం ఉప్పొంగుతుంది. అలాగే వీర సావర్కర్ పేరు వినగానే గొప్ప దేశ భక్తుడు మదిలో మెదులుతారు. వీరిద్దరూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు.. ఇద్దరిదీ విప్లవ మార్గమే.. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సావర్కర్ ప్రభావం భగత్ సింగ్ పై బలంగా ఉంది. అలాగే సావర్కర్ కు భగత్ సింగ్ అంటే అమితమైన ప్రేమ. వీరిద్దరూ తమ రచనల్లో పరస్పరం చేసుకున్న ప్రస్థావనలే ఇందుకు ఉదాహరణ.
భగత్ సింగ్ 1926లో విశ్వ ప్రేమ్, మాత్వాలా పత్రికల్లో సావర్కర్ గురుంచి రాస్తూ “ప్రపంచ ప్రేమికుడైన గొప్ప తిరుగుబాటుదారుడు, ధృడచిత్తుడైన నాయకుడు సావర్కర్ అని పిలవడానికి మేము కొంచెం వెనుకాడము.. ” అని తెలిపారు. “మా అంతిమ లక్ష్యం విశ్వ సోదరభావం. జాతీయవాదం.. అక్కడికి చేరుకోవడానికి ఒక అడుగు మాత్రమే” అని సావర్కర్ చాలాసార్లు చెప్పారు” అన్నారు.. సావర్కర్ పై భగత్ సింగ్ కు ఉన్న గౌరవాన్ని ఈ వాక్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఆ రోజుల్లో రాజకీయాల్లో పాల్గొనకూడదనే షరతుపై విడుదలైన సావర్కర్ రత్నగిరిలో గృహ నిర్బంధంలో ఉన్నారు.
లండన్ లో ఇండియా హౌస్ ద్వారా ఎంతో మంది విప్లవ వీరులను తయారు చేసి సావర్కర్ గురుంచి, కర్జన్ వాలీ అనే బ్రిటిష్ అధికారిని మదన్ లాల్ దింగ్రా హత్య చేయడం గురుంచి కీర్తి పత్రిక (మార్చి 1926)లో భగత్ సింగ్ చాలా గొప్పగా అభివర్ణించారు. 1926 లో పంజాబీ హిందీ సాహిత్య సమ్మేళన్ కోసం భగత్ సింగ్ ఒక వ్యాసం రాశారు. భారతీయ ముస్లింలు హిందీ భాష ప్రాముఖ్యతను అర్థం చేసుకోకుండా అరబ్, పర్షియన్ లిపిలోని ఉర్దూకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పు పట్టారు. జాతీయత విషయంలో టర్కీ నాయకుడు కమాల్ టర్క్ వారు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇక్కడ భగత్ సింగ్ వ్యక్త పరిచిన ఈ అభిప్రాయాలు సావర్కర్ దృష్టి కొణంలోనివని మనం ఇక్కడ గమనించాలి.
1857 స్వాతంత్ర పోరాటంపై సావర్కర్ రాసిన పుస్తకాన్ని భగత్ సింగ్ ప్రచురింపజేసి విప్లవకారులకు పంచి పెట్టారు. అదే విధంగా సావర్కర్ రాసిన హిందూ పదపాద షాహీ గ్రంధం నుంచి భగత్ సింగ్ స్పూర్తి పొందారు. ఆయన జైలు డైరీల్లో ఆ గ్రంథంలోని కొన్ని కొటేషన్లను చూడవచ్చు.. భగత్ సింగ్ పేర్కొన్న సైన్స్ ఆధారిత ‘సోషలిస్ట్ హిందుస్తాన్’ వర్ణన సావర్కర్ యొక్క ‘సైన్స్ ఆధారిత హిందుస్తాన్’ కు చాలా దగ్గరగా ఉంది. విప్లవత్మక ఉద్యమంలో సావర్కర్ సోదరులు మా నాయకులు అని భగత్ సింగ్ సహాయకుడు యశ్ పాల్ చెప్పారు.
1928లో లాలా లాజ్పత్ రాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ సావర్కర్ ఒక వ్యాసం రాశారు. ఈ దాడిలో గాయడిన లాలాజీ గాయాలతో మరణించారు. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు సాండర్స్ ను భగత్ సింగ్, అతని సహచరులు చంపారు. మహాత్మా గాంధీ దీనిని పిరికి చర్యగా అభివర్ణించారు. గాంధీ జీ ప్రకటనను విమర్శిస్తూ సావర్కర్ 1929లో మరో ఒక వ్యాసం రాశారు. సావర్కర్ తన రచనల్లో భగత్ సింగ్ ను చాలాసార్లు ప్రస్తావించారు. కీర్తి పత్రిక (మే 1928)లో “ది రియల్ మీనింగ్ ఆఫ్ టెర్రర్” పేరుతో భగత్ సింగ్, అతని సహచరుల గురుంచి రాశారు. వీర్ సావర్కర్ రాసిన ‘Armed but tyrannical’ అనే వ్యాసాన్ని bomb’s philosophy పేరిట భగత్
సింగ్ ప్రచురించారు.
పార్లమెంట్లో బాంబు దాడి కేసులో 23 మార్చి 1931 న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది. వీరి త్యాగాన్ని స్మరిస్తూ సావర్కర్ ఓ గీతాన్ని రాసి స్వర పరిచారు. రత్నగిరిలోని సావర్కర్ ఇంటిపై నిరంతరం కాషాయ ధ్వజం ఎగిరేది.. అయితే మార్చి 24 న ఆ ఇంటిపై నల్ల జెండా
ఎగిరింది. సావర్కర్, భగత్ సింగ్ లు ఒక సందర్భంగా కలుసుకున్నారని చెబుతారు. కానీ అందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ సావర్కర్ ప్రభావం భగత్ సింగ్ పై చాలా ఉంది. అలాగే సావర్కర్ కు భగత్ సింగ్ పై అమితమైన ప్రేమ గౌరవాలను మనం గమనించవచ్చు.
ఇవాళ 23 మార్చి 1931న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరి తీసిన రోజును షహీద్ దివస్ గా జరుపుకుంటున్నాం. ఈ యోధుల త్యాగాలను స్మరించుకుంటూ స్ఫూర్తిని పొందుదాం..
(సరిగ్గా రెండేళ్ల క్రితం డాక్టర్ మధుసూదన్ చెరేకర్ రాసిన వ్యాసానికి నా సంక్షిప్త స్వేచ్ఛానువాదం ఇది)
~ క్రాంతిదేవ్ మిత్రా
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)