నాలుగు రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుని, రాజ్యసభలో ఎంపీల సంఖ్యను వందదాటిన తరుణంలో ఆవిర్భావ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్ గా మాట్లాడారు మోదీ. పార్టీ స్థాపన నుంచి …ఇప్పటివరకు పార్టీకోసం కష్టపడిన వారిని, బలిదానాలు చేసిన వారిని గుర్తు చేసుకున్నారు. జన సంఘ్ శకాన్ని గుర్తు చేసుకోవాల్సిన సందర్భమూ ఇదేనన్నారు మోదీ.
ఆ రోజుల్లో నూనె దీపాలను పట్టుకుని నడిచినవారిని, ఆ తర్వాత కమలంతో నడుస్తున్నవారిని గుర్తు చేసుకోవాలని అన్నారు ప్రధాని. పార్టీని వైభవోపేతంగా తీర్చిదిద్దడం కోసం మూడు, నాలుగు తరాలవారు తమ జీవితాలను అంకితం చేశారన్నారు. ఏ పార్టీ ప్రభుత్వమైనా దేశం కోసం ఏదీ చేయరనే భావన ప్రజల్లో ఉండేదని కానీ ఇప్పుడు దేశం వేగంగా పురోగమిస్తోందని…ఇది అందరం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయమనీ అన్నారు.
పేదలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు, యువత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పని చేయడమే తమ పార్టీ ఉద్దేశమని స్పష్టం చేశారు.
నారీశక్తి భారత భవిష్యత్ కు దిశను నిర్దేశిస్తున్న మోదీ…. మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామన్నారు. దేశసేవ కోసం అనునిత్యం కృషి చేయాలంటూ కార్యకర్తలు, నేతలకు సూచించారు. తాను కూడా ఓ కార్యకర్తలా పార్టీ ఇచ్చే ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని తెలిపారు. ఎనిమిదేళ్లుగా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ను సాధించేందుకు బీజేపీ శ్రమిస్తున్న తీరును, తీసుకొంటున్న చర్యలను వివరించారు.
మన దృష్టిలో రాజనీతి, రాష్ట్రనీతి (రాజకీయం-.. జాతీయ విధానం) సమానంగా వెళ్లాలి…. కానీ ఇప్పుడు దేశంలో రెండు రకాల రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకటి కుటుంబ రాజకీయాలు, ఇంకొకటి దేశభక్తి రాజకీయాలని కుటుంబపార్టీలను ఎండగట్టారు. బీజేపీ దేశభక్తికి అంకితమై పని చేస్తుంటే ప్రత్యర్థి పార్టీలు వారసత్వ రాజకీయాల్లో నిమగ్నమై ఉన్నాయని ప్రధాని అన్నారు. వారసులను అందలమెక్కించే పనిలో ఉన్న ఇతర పార్టీలు.. దేశ యువతకు అభివృద్ధి చెందే అవకాశమే ఇవ్వలేదని ఆరోపించారు. దేశంలో ప్రధానంగా ఉన్న ఈ సమస్యపై గొంతు వినిపించిన, వ్యతిరేకించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని అంటూ…అందుకు బీజేపీ కార్యకర్తలు అందరూ గర్వపడాలని చెప్పారు.
కుటుంబ పార్టీల్లో అన్ని వ్యవస్థల్లోనూ వారి వారసులదే అధికారం అని చెబుతూ ఇలాంటి పార్టీలతో దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రధాని హెచ్చరించారు. అందుకే దేశ యువత, ప్రజలు కుటుంబ పార్టీలు ఎంత ప్రమాదమో అర్థం చేసుకుంటున్నారని ప్రధాని చెప్పారు. కుటుంబ పార్టీలు యువతను ఎదగనివ్వకుండా చేస్తున్నాయని మండిపడ్డారు.
సమాజంలోని అట్టడుగు వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందించడమే మన లక్ష్యం అని చెబుతూ సామాజిక న్యాయం ధ్యేయంగా ముందుకెళ్తున్నామని మోదీ తెలిపారు. బీజేపీ కార్యకర్తలు ప్రజల్లో జాగరూకత తీసుకురావాలని ఆయన కోరారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు టక్కర్ ఇవ్వడంలో బీజేపీ సఫలమైందని చెబుతూ అందుకే ప్రజల నుంచి పార్టీకి ఆదరణ దక్కుతోందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పాలన సాగించే ప్రభుత్వాలపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)