నేర్చుకోడానికి వయస్సు అడ్డంకి కాదు….
తమిళనాడుకు చెందిన 92 ఏళ్ల పండితుడు టి శ్రీనివాసాచార్య స్వామి కంప్యూటర్ను ఉపయోగించి ఒక పుస్తకం రాయడానికి చేసిన ప్రయత్నాలు ఇటీవల వెలుగులోకి వచ్చిన తరువాత పలు ప్రశంసలు పొందారు.
మొన్న ఆదివారం (డిసెంబర్ 27) ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ లో ఈ పండితుని గురించి చెపుతూ గొప్ప స్ఫూర్తి ప్రదాతగా అభివర్ణించారు.
మోడీ తన రేడియో షో ‘మన్ కి బాత్’ 72 వ ఎడిషన్లో ఆయన గురించి మాట్లాడుతూ, “తమిళనాడుకు చెందిన 92 సంవత్సరాల టి శ్రీనివాసాచార్య స్వామి జీ ఒక పుస్తకాన్ని వ్రాస్తున్నారు,అది కూడా కంప్యూటర్లో టైప్ చేయడం ద్వారా. ఈ వయసులో కూడా అతని పరిశోధనాత్మకత, ఆత్మవిశ్వాసం అతని యుక్త వయసు రోజుల్లో ఉన్నట్లే ఉన్నాయి. ఈ సంస్కృత మరియు తమిళ పండితుడు ఇప్పటి వరకు 16 ఆధ్యాత్మిక పుస్తకాలు రాశారు. ” అని మోడీ పేర్కొన్నారు.
మోడీ ఆయన గురించి ఇంకా చెపుతూ…
ప్రస్తుత కాలంలో పుస్తకాలు రాయడం మరియు ముద్రించే విధానం మారిందని గ్రహించిన అతను 86 సంవత్సరాల వయస్సులో కంప్యూటర్ మరియు దానికి అవసరమైన సాఫ్ట్వేర్ నేర్చుకున్నారు. పరిశోధనాత్మకత మరియు నేర్చుకోవాలనే కోరిక ఉన్నంత వరకు జీవితం శక్తితో నిండి ఉంటుంది అనేదానికి అతని జీవితం స్పష్టమైన ఉదాహరణ, ”అన్నారాయన.
శ్రీ టి శ్రీనివాసచార్య స్వామి అగమా శాస్త్రాలలో (ఆలయ ఆచారాలు / అభ్యాసాలు) నిపుణులు. అతను 86 సంవత్సరాల వయస్సులో అడోబ్ పేజ్మేకర్ నేర్చుకున్నారు. తమిళం మరియు సంస్కృతం రెండింటిలోనూ తన రోజువారీ టైపింగ్ కంప్యూటర్ లో చేసుకుంటున్నారు.
అతను వేదాలను అభ్యసించారు. మైలాపూర్ లోని శ్రీ వేదాంతదేశికర్ ఆలయంలో పూజారిగా పనిచేశాడు. అతను 1980 లలో తన సొంత ప్రెస్ శ్రీ రాఘవసింహం ప్రెస్ ను ప్రారంభించాడు. పూజారి కావడానికి అర్హత పొందడానికి చదవ వలసిన పుస్తకాలుగా ఇతని పుస్తకాలను హెచ్ఆర్ & సిఇ బోర్డు సూచించింది. అతను ధార్మిక ప్రవచనాలను కూడా ఇస్తారు
పాత సంస్కృత లిపిలను చదివే అతని అలవాటు అతన్ని పరిశోధనలకు పురిగొల్పింది. అతను గత కొన్నేళ్లుగా తన సొంత పుస్తకాలు రాస్తూ ప్రింట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు, ప్రాచీన సంస్కృత గ్రంథాల ఆధారంగా వివిధ విషయాలపై 16 పుస్తకాలు రాశారు. శ్రీనివాసచార్య స్వామి గారికి కంపోజ్ చేయడంలో కూడా ప్రావీణ్యం ఉంది. అతను 2000 సం. వరకు వరకు చేతితో కంపోజ్ చేస్తూ ఆ తరువాత ఆ పనికి అతను కంప్యూటర్ను ఉపయోగించడం ప్రారంభించారు.
..చాడా శాస్త్రి…