తెలంగాణకు చెందిన ఓబీసీ నేత డాక్టర్ కోవా లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనకు ప్రాతినిధ్యం కల్పిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి విడుదల చేసిన నలుగురు రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరుంది. ఈరోజు లక్ష్మణ్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వెళ్లిన ఆయన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
తాజా జాబితాలో మధ్యప్రదేశ్ నుంచి సుమిత్రా వాల్మీకి, కర్ణాటక నుంచి లాల్ సింగ్ సిర్హోయలను బీజేపీ నామినేట్ చేసింది. రెండు జాబితాల్లో కలిపి మొత్తం 22 మందిని బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇవాళ్టి(మే 31)తో నామినేషన్లకు తుది గడువు ముగియనుంది.
బీజేపీ తనను రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల కె.లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి అవకాశం బీజేపీలో తప్ప మరో పార్టీలో సాధ్యం కాదన్నారు. ఇది ఒక సాధారణ కార్యకర్తకు బీజేపీ అధిష్ఠానం ఇచ్చిన గుర్తింపు అని పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలిపారు.