దేశ ప్రజలు ఎదురుచూస్తున్న ఉమ్మడి పౌర స్మృతి పై చిన్న కదలిక. అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలు, మతపరమైన సంస్థలను 22వ భారత శాసన పరిశీలక సంఘం కోరింది. 2018లో ఈ కమిషన్ విడుదల చేసిన ‘‘రిఫార్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ’’పై కన్సల్టేషన్ పేపర్లో ‘‘ఈ దశలో యూసీసీ ఏర్పాటు అవసరం లేదు, వాంఛనీయం కాదు’’ అని తెలిపింది. గతంలో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పంపిన రిఫరెన్స్ను కమిషన్ పరిశీలిస్తోంది.2016, 2018 సంవత్సరాల్లో యూసీసీని పరిశీలించింది. వివిధ కోర్టు తీర్పుల నేపథ్యంలో దీని ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా మరోసారి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించినట్లు లా కమిషన్ బుధవారం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ప్రజలు, గుర్తింపు పొందిన మత సంస్థలు 30 రోజుల్లోగా తమ అభిప్రాయాలను సమర్పించాలని తెలిపింది.వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో వేర్వేరు మతస్థులకు వేర్వేరు చట్టాలు అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని తొలగించి, దేశంలోని ప్రజలందరికీ ఒకే నిబంధనలు వర్తించే విధంగా చేయడం కోసం ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలనే అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో అధికరణ 44 కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. అయితే దీనిని కోర్టులు అమలు చేయజాలవని అధికరణ 37 చెప్తోంది.