స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా.. పొడవైన రవాణా రైలు ‘సూపర్ వాసుకి’ ని ప్రవేశపెట్టింది ఇండియన్ రైల్వే. దానికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఈ రైలును నడిపింది. ఛత్తీస్గఢ్లోని కోర్బా నుంచి నాగ్పూర్లోని రాజ్నంద్గావ్ వరకు సూపర్ వాసుకిలో బొగ్గును తీసుకువెళ్లారు. ఈ రైలు 27,000 టన్నుల బరువును మోసే 295 వ్యాగన్లను కలిగి ఉంది. ఈ రైలు 3.5 కిమీల పొడవైంది.
రైలు 13:50కి కోర్బా నుంచి బయలుదేరి 267 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి 11 గంటల 20 నిమిషాలు పట్టింది. ఐదు గూడ్స్ రైళ్లను కలిపి ఈ రైలును రూపొందించారు.
ఇది అతి పొడవైన, బరువైన సరుకు రవాణా రైలు. రైలు స్టేషన్ ను దాటడానికి నాలుగు నిమిషాల సమయం పడుతుందని ఇండియన్ రైల్వే తెలిపింది. సూపర్ వాసుకి మోసుకెళ్లే బొగ్గు మొత్తం 3000 మెగావాట్ల పవర్ ప్లాంట్ను ఒక రోజు పూర్తి చేయడానికి సరిపోతుంది. ప్రస్తుతం ఒక ప్రయాణంలో 9,000 టన్నుల బొగ్గును మోసుకెళ్లే సామర్థ్యం ఉంది, కానీ సూపర్ వాసుకితో దీనికి మూడు రెట్లు ఎక్కువగా సరఫరా చేయొచ్చు.
విద్యుత్తు కేంద్రాల ఇంధన కొరతను నివారించడానికి, ముఖ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న కాలంలో బొగ్గును రవాణా చేయడానికి ఇలాంటి రైళ్లను మరింత తరచుగా ఉపయోగించాలని రైల్వే యోచిస్తోంది.