మరోసారి నవ్వులపాలు.. రాహుల్కి ఏ మంత్రిత్వ శాఖలు ఉన్నాయో కూడా తెలియదా..?
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి నవ్వుల పాలయ్యారు. ఇటీవల రాహుల్ గాంధీ పుదుచ్చేరి పర్యటనలో భాగంగా ఓ ప్రకటన చేశారు. కేంద్రంలో మత్స్యశాఖను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సెటైర్స్ వేస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాహుల్ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. 2019లో మత్స్య, పశుసంవర్ధక శాఖను ఏర్పాటు చేసినప్పుడు రాహుల్ గాంధీ వెకేషన్లో ఉన్నారన్నారు. రెండేళ్లు గడుస్తున్నా.. మత్స్యశాఖ అనేది ఉందన్న విషయాన్ని కూడా తెలియని నాయకుడిని ప్రజలు కోరుకుంటున్నారా..? అనేది తాను తెలుసుకోవాలనుకుంటున్నానంటూ చురకలంటించారు. పుదుచ్చేరిలోని కరైకాల్లో జరిగిన ర్యాలీలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.